VIPs in Plane Crashes: విమాన ప్రమాదాల్లో మరణించిన వీఐపీలు వీళ్లే
ABN, Publish Date - Jun 13 , 2025 | 11:22 AM
అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మరణించిన సంగతి తెలసిందే. అయితే, విజయ్ రూపానీ కంటే ముందే చాలా మంది వీఐపీలు విమాన ప్రమాదాల్లో తమ ప్రాణాలను కోల్పోయారు.
Plane Crashes Incidents: అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఎయిర్ ఇండియా విమానం కూప్పకూలి 241 మంది మృతి చెందారు. ఈ ప్రమాద ఘటనలో మొత్తం 271 మంది తమ ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఈ ప్రమాదంలో మరణించారు. అయితే, విజయ్ రూపానీ కంటే ముందే గతంలో చాలా మంది వీఐపీలు విమాన ప్రమాదాల్లో తమ ప్రాణాలను కోల్పోయారు. ఇప్పుడు విమాన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వీఐపీల గురించి తెలుసుకుందాం..
భారతదేశపు మొట్టమొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ బిపిన్ రావత్, మరో 12 మంది డిసెంబర్ 8, 2021న తమిళనాడులోని కూనూర్లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ (DSSC) సమీపంలో హెలికాప్టర్ కూలిపోవడంతో మరణించారు.
ఏప్రిల్ 30, 2011లో అప్పటి అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి దోర్జీ ఖండు, తవాంగ్ నుండి ఇటానగర్ కు మరో నలుగురితో కలిసి వెళుతుండగా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు.
సెప్టెంబర్ 3, 2009లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. చిత్తూరు జిల్లాలోని ఒక గ్రామానికి వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న బెల్ 430 హెలికాప్టర్ దట్టమైన అడవిలో కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.
హర్యానాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, మంత్రి O.P. జిందాల్, సురేంద్ర సింగ్ మార్చి 31, 2005న హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఈ ప్రమాదం ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్ సమీపంలో జరిగింది.
దక్షిణ భారత సినీ నటి సౌందర్య ఏప్రిల్ 17, 2004న ఎన్నికల ప్రచారానికి వెళుతుండగా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు.
సెప్టెంబర్ 2004లో మేఘాలయ అప్పటి కమ్యూనిటీ డెవలప్మెంట్ మంత్రి సి సంగ్మా, ముగ్గురు ఎమ్మెల్యేలు, మరో ఆరుగురు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు.
మార్చి 3, 2002లో అప్పటి లోక్సభ స్పీకర్, టీడీపీ నాయకుడు జిఎంసి బాలయోగి ఆంధ్రప్రదేశ్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు.
కాంగ్రెస్ మాజీ క్యాబినెట్ మంత్రి మాధవరావు సింధియా సెప్టెంబర్ 30, 2001లో విమాన ప్రమాదంలో మరణించారు. కాంగ్రెస్ ర్యాలీలో ప్రసంగించడానికి ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
మే 2001లో అప్పటి అరుణాచల్ ప్రదేశ్ విద్యా మంత్రి డేరా నతుంగ్, మరో ఐదుగురు తవాంగ్ సమీపంలో హెలికాప్టర్ కూలిపోవడంతో మరణించారు.
అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి ఎన్వీఎన్ సోము 1997 నవంబర్ 14న మరణించారు.
జూలై 9, 1994లో అప్పటి పంజాబ్ గవర్నర్ సురేంద్ర నాథ్, ఆయన కుటుంబ సభ్యులు తొమ్మిది మంది, మరో 12 మంది హిమాచల్ ప్రదేశ్ కొండలలో టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే కూలిపోయారు.
జూన్ 23, 1980లో భారత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ చిన్న కుమారుడు సంజయ్ గాంధీ గ్లైడర్ నడుపుతుండగా మరణించారు. ఢిల్లీలోని సఫ్దర్జంగ్ విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన వెంటనే ఈ ప్రమాదం జరిగింది.
మే 30, 1973లో ఇందిరా గాంధీ ప్రభుత్వంలో ఉక్కు మంత్రిగా ఉన్న మోహన్ కుమారమంగళం, 56 సంవత్సరాల వయసులో న్యూఢిల్లీలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆగస్టు 18, 1945న ఫార్మోసాలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు.
Also Read:
గుబులు పుట్టించిన మరో ఎయిరిండియా ఫ్లైట్.. 3 గంటలు గాల్లోనే..!
అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. ఆమె చెప్పిందే జరిగింది
For More National News
Updated Date - Jun 13 , 2025 | 12:18 PM