రష్యా చమురు కొంటే 500% సుంకం
ABN, Publish Date - Jul 03 , 2025 | 05:59 AM
ఉక్రెయిన్తో యుద్ధం తర్వాత రష్యాకు మిగిలిన అతి పెద్ద ఆదాయ వనరు చమురు. రష్యాపై ఆర్థిక ఆంక్షలు మరింత కఠినతరం చేయాలంటే ఆ దేశం నుంచి చమురు కొంటున్న దేశాలపై భారీగా సుంకాలు విధించాలంటూ అమెరికా సెనేటర్ లిండ్సీ గ్రహమ్ ఒక బిల్లు తయారుచేశారు.
అమెరికాలో బిల్లు.. భారత్పై తీవ్ర ప్రభావం
వాషింగ్టన్, జూలై 2 : ఉక్రెయిన్తో యుద్ధం తర్వాత రష్యాకు మిగిలిన అతి పెద్ద ఆదాయ వనరు చమురు. రష్యాపై ఆర్థిక ఆంక్షలు మరింత కఠినతరం చేయాలంటే ఆ దేశం నుంచి చమురు కొంటున్న దేశాలపై భారీగా సుంకాలు విధించాలంటూ అమెరికా సెనేటర్ లిండ్సీ గ్రహమ్ ఒక బిల్లు తయారుచేశారు. అధ్యక్షుడు ట్రంప్ సూచనతోనే ఈ బిల్లు తయారైందని వార్తలు వెలువడుతున్నాయి. రష్యా చమురులో 70 శాతం భారత్, చైనాలే కొంటున్నాయి. అంటే గ్రహమ్ బిల్లు ప్రధానంగా ఈ రెండు దేశాలనే లక్ష్యంగా చేసుకున్నట్టు స్పష్టమవుతోంది. ఇటువంటి దేశాలు అమెరికాకు ఎగుమతి చేసే సరుకులపై 500 శాతం సుంకం విధించాలని తన బిల్లులో ఆయన ప్రతిపాదించారు.
రష్యా దగ్గర చమురు కొనడం అంటే ఉక్రెయిన్కు మద్దతు నిరాకరించినట్టే భావించాల్సి ఉంటుందని ఆ బిల్లులో పేర్కొన్నారు. తన బిల్లుకు ట్రంప్ మద్దతు ఇచ్చారని, దీనిపై ముందుకెళ్లడానికి ఇదే సరైన సమయమని ఆయన సూచించారని గ్రహమ్ తెలిపారు. తన బిల్లు సెనేట్కు ఆగస్టులో రావచ్చునని తెలిపారు. నిజానికి, 2022లో ఉక్రెయిన్తో రష్యా యుద్ధం మొదలవగానే ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు భగ్గుమన్నాయి. భారత్కు చౌకగా చమురు ఇవ్వడానికి ఈ సమయంలో రష్యా ముందుకొచ్చింది. యుద్ధానికి ముందు భారత్కు ప్రపంచ దేశాల నుంచి దిగుమతి అయిన చమురు ఉత్పత్తుల్లో ఒక శాతం కంటే తక్కువగానే రష్యా నుంచి అందేవి. ఇప్పుడు ఆ పరిమాణం 40-45 శాతానికి పెరిగిపోయింది.
Updated Date - Jul 03 , 2025 | 05:59 AM