కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గేకు చేదు అనుభవం
ABN, Publish Date - Jun 19 , 2025 | 03:41 AM
కర్ణాటక గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, ఐటీబీటీ శాఖ మంత్రి ప్రియాంక ఖర్గేకి అమెరికాలో పర్యటించేందుకు అనుమతి లభించలేదు.
బెంగళూరు, జూన్ 18(ఆంధ్రజ్యోతి): కర్ణాటక గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, ఐటీబీటీ శాఖ మంత్రి ప్రియాంక ఖర్గేకి అమెరికాలో పర్యటించేందుకు అనుమతి లభించలేదు. దీనికి భారతీయ విదేశీ వ్యవహారాల శాఖ నిర్ణయం కారణమా? లేక అమెరికా నిరాకరించిందా.? అనే విషయంలో స్పష్టత లేదు. ప్రియాంక ఖర్గే ప్యారిస్ పర్యటనలో ఉన్నారు. అక్కడి నుంచి అమెరికా వెళ్లి.. బోస్టన్, శ్యాన్ఫ్రాన్సిస్కో నగరాలలో జరిగే బయో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ డిజైన్ అండ్ ఆటోమేషన్ కాన్ఫెరెన్స్లలో పాల్గొనాల్సి ఉంది. ప్యారి్సలో మంగళవారం అధికారిక కార్యక్రమాలను ముగించుకుని, అమెరికాకు వెళ్లేందుకు ఆయన సిద్ధమయ్యారు. కానీ అనుమతులు లభించకపోవడంతో విచారం వ్యక్తం చేశారు. భారత్కు తిరిగి వచ్చాక కేంద్ర ప్రభుత్వంతో నిర్దిష్టమైన కారణాలు కోరుతానని మంత్రి అన్నారు. ఇలా ఉండగా మంత్రి వెంట ఉన్న ఓ ఐఏఎస్ అధికారికి అమెరికా వెళ్లేందుకు అనుమతులు లభించాయి. ఓ మంత్రికి విదేశీ పర్యటనకు అనుమతి నిరాకరించడం, ఆయన వెంట ఉన్న ఐఏఎస్ అధికారికి అనుమతులు లభించడం రాజకీయంగా దుమారం రేపుతోంది
Updated Date - Jun 19 , 2025 | 03:41 AM