Supreme Court: బెంచ్ల తీరు ఆందోళనకరం
ABN, Publish Date - May 02 , 2025 | 05:08 AM
పొంతనలేని, పరస్పర విరుద్ధ తీర్పులు న్యాయవ్యవస్థ పట్ల ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయని సుప్రీంకోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది. గృహహింస కేసులో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన వేర్వేరు బెంచ్ల తీర్పులను తిరస్కరించి, బాధితురాలి పిటిషన్ను అనుమతిస్తూ కేసు కొనసాగించాలని ఆదేశించింది.
పొంతన లేని తీర్పులతో జూదరి క్రీడలా మారిన వ్యాజ్యాలు
ఓ కేసులో కర్ణాటక హైకోర్టు తీరుపై సుప్రీం ఫైర్
న్యూఢిల్లీ, మే 1: ధర్మాసనాలు ఇస్తున్న పొంతనలేని, పరస్పర విరుద్ధ తీర్పులు న్యాయవ్యవస్థ పట్ల ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వాటి తీరుతో జూదరి క్రీడలా వ్యాజ్యం తయారైందని ఆందోళన వ్యక్తంచేసింది. నిర్ణయాల్లో బెంచ్ల అస్థిర వైఖరి కక్షదారులు తమకు అనుకూలంగా ఉండే కోర్టును ఎంచుకునే పరిస్థితిని (ఫోరమ్ షాపింగ్) తెచ్చిందని ఆక్షేపించింది. భర్తపై నమోదైన గృహహింస అభియోగాలను కొట్టివేస్తూ కర్ణాటక హైకోర్టు వెలువరించిన తీర్పుపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు తీర్పును రద్దు చేసింది. ఈ వ్యాజ్యాన్ని బాధిత భార్య సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. భర్త, అత్తామామలు తనపై గృహహింసకు పాల్పడ్డారంటూ ఆమె కేసు పెట్టగా, ఆకేసును రద్దు చేయాలంటూ నిందితులు వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించారు. ఒక బెంచ్ అత్తామామల పిటిషన్ను కొట్టివేయగా.. మరో బెంచ్ ఆమె భర్తకు ఊరట కల్పించింది.
పూర్వ బెంచ్ తీర్పును పరిశీలించకుండానే అతనిపై మోపిన అభియోగాలను రద్దుచేసింది. దీనిపై భార్య సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ను జస్టిస్ పీఎస్ నరసింహా, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీల బెంచ్ విచారించింది. ఒకే కేసులో రెండు బెంచ్లు వేర్వేరు తీర్పులు, పొంతనలేని నిర్ణయాలు ఎలా వెలువరించాయని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. తాజా ఘటనలో ఒక బెంచ్ తీర్పును మరో బెంచ్ కనీసం పరిశీలించలేదని, నిందితుడికి ఊరటను కల్పించడానికి కారణాలను తీర్పులో ప్రస్తావించలేదని జస్టిస్ బాగ్చీ తెలిపారు. బాధిత భార్య పిటిషన్ను అనుమతిస్తూ నిందితుడిపై తిరిగి క్రిమినల్ అభియోగాలు మోపి కేసు దర్యాప్తును కొనసాగించాలన్నారు.
ఇవి కూడా చదవండి
ACB Custody: విడుదల గోపిపై ఏసీబీ ప్రశ్నల వర్షం
PM Modi AP Visit: ప్రధాని మోదీ ఏపీ పర్యటన షెడ్యూల్ ఖరారు
Read Latest AP News And Telugu News
Updated Date - May 02 , 2025 | 05:08 AM