Manipur: మణిపూర్లో మరో ఆరు నెలలు రాష్ట్రపతి పాలన, రాజ్యసభ ఆమోదం
ABN, Publish Date - Aug 05 , 2025 | 03:30 PM
మణిపూర్లో రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలలు పొడిగించేందుకు మార్గం సుగమం అయింది. ఇవాళ రాజ్యసభ ఈ తీర్మానాన్ని ఆమోదించింది. ప్రతిపక్షాల తీవ్ర నినాదాల మధ్య కేంద్ర హోంశాఖ..
న్యూఢిల్లీ, ఆగస్టు 5 : ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలలు పొడిగించేందుకు మార్గం సుగమం అయింది. ఇవాళ (మంగళవారం) రాజ్యసభ ఈ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ ఉదయం, ప్రతిపక్షాల తీవ్ర నినాదాల మధ్య కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ తీర్మానాన్ని ఎగువ సభ(రాజ్యసభ)లో ప్రవేశపెట్టారు. '2025 ఫిబ్రవరి 13న రాష్ట్రపతి రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 కింద జారీ చేసిన మణిపూర్కు సంబంధించి ప్రకటన అమలులో కొనసాగింపు' అనే చట్టబద్ధమైన తీర్మానాన్ని సభ ఆమోదించింది.
ఇప్పటికే జూలై 30న, మణిపూర్లో రాష్ట్రపతి పాలనను పొడిగించేందుకు లోక్సభ తీర్మానాన్ని ఆమోదించిన సంగతి తెలిసిందే. ఎన్ బిరేన్ సింగ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కొన్ని రోజుల తర్వాత, ఫిబ్రవరి 13న మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించారు. దాదాపు రెండు నెలలుగా రాష్ట్రాన్ని పీడిస్తున్న హింస, రాజకీయ అస్థిరత మధ్య సింగ్ రాజీనామా చేశారు. దీంతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 కింద అమలులోకి వచ్చే ఈ నిర్ణయం ప్రకారం.. రాష్ట్రపతి ఇప్పుడు గవర్నర్ ద్వారా మణిపూర్ రాష్ట్ర పరిపాలనా విధులను నేరుగా నియంత్రిస్తారని అర్థం.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన భారత గెజిట్లో ప్రచురించబడిన ఈ ప్రకటన, మణిపూర్ శాసనసభ అధికారాలను పార్లమెంటుకు బదిలీ చేస్తుందని, రాష్ట్ర ప్రభుత్వ అధికారాన్ని సమర్థవంతంగా నిలిపివేస్తుందని పేర్కొంది. ఈ ఉత్తర్వు ప్రకారం, గవర్నర్ అధికారాలను ఇప్పుడు రాష్ట్రపతి ఉపయోగిస్తారు. రాష్ట్ర శాసనసభ అధికారాన్ని పార్లమెంటు స్వీకరిస్తుంది. రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేయలేనప్పుడు సాధారణంగా రాష్ట్రపతి పాలన విధిస్తారు.
రాష్ట్రపతి పాలన విధించడం పార్లమెంటరీ ఆమోదానికి లోబడి ఆరు నెలల వరకు ఉంటుంది. ఈ కాలంలో, కేంద్ర ప్రభుత్వం పాలనను పర్యవేక్షిస్తుంది. కొత్త అసెంబ్లీని ఎన్నుకోవడానికి కొత్తగా ఎన్నికలు జరగవచ్చు. మణిపూర్లో జరిగిన అశాంతిలో ప్రధానంగా మెజారిటీ మెయిటీ కమ్యూనిటీ, మైనారిటీ కుకి-జోమి తెగల మధ్య ఘర్షణలు జరిగాయి. ఆర్థిక ప్రయోజనాలు, ఉద్యోగ కోటాలు ఇంకా భూమి హక్కులకు సంబంధించిన వివాదాలపై ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ హింస వందలాది మంది మరణానికి దారితీసింది. సుమారు 60,000 మంది నిరాశ్రయులయ్యారు.
ఇవి కూడా చదవండి..
జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కన్నుమూత
ఎర్రకోటలో భద్రతా వైఫల్యం.. ఏడుగురు పోలీసుల సస్పెన్షన్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 05 , 2025 | 03:30 PM