Health Concerns: బలవర్ధక భారతం
ABN, Publish Date - Jul 04 , 2025 | 03:39 AM
ప్రొటీన్ వినియోగంలో భారత్ బలవర్ధకంగా మారుతోందని కేంద్ర ప్రభుత్వ తాజా గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి.
దేశంలో పెరిగిన ప్రొటీన్ వినియోగం
అదే సమయంలో ఆందోళనకర స్థాయిలో కొవ్వు తినేస్తున్నారు
కేంద్ర ప్రభుత్వ తాజా గణాంకాల వెల్లడి
న్యూఢిల్లీ, జూలై 3: ప్రొటీన్ వినియోగంలో భారత్ బలవర్ధకంగా మారుతోందని కేంద్ర ప్రభుత్వ తాజా గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. అదే సమయంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలు అనే తేడాలేకుండా భారతీయులు కొవ్వు పదార్థాలను తెగ తినేస్తున్నారని, ఇది ఆందోళనకరమని కేంద్ర ప్రభుత్వ పరిధిలోని గణాంకాల కార్యాలయం బుధవారం విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. 2009-10తో పోలిస్తే 2023-24 సంవత్సరంలో ప్రొటీన్, కొవ్వు పదార్థాల వినియోగం పెరిగిందని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు 2009-10 లో రోజుకు సగటున 59.3గ్రాముల ప్రొటీన్ను తీసుకోగా 2023-24 అది 61.8గ్రాములకు పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో ప్రొటీన్ వినియోగం 58.8 గ్రాముల నుంచి 63.4 గ్రాములకు పెరిగింది.
ప్రజలు పప్పుధాన్యాలు, గుడ్లు, చేపలు, మాంసాన్ని ప్రొటీన్గా తీసుకుంటున్నట్లు నివేదిక తెలిపింది. నగరాలు, పట్టణాల్లో పప్పు ధాన్యాల వినియోగం కొంత తగ్గడం గమనార్హం..! రాజస్థాన్, హరియాణా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్వంటి రాష్ట్రాల్లో ప్రొటీన్ వినియోగం స్వల్పంగా పడిపోయింది. ప్రొటీన్, కొవ్వు పదార్థాలను భారతీయులు ఎక్కువగా తీసుకోవడం ఆందోళనకరమని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు సగటు కొవ్వు పదార్థాల వాడకం 43.1 గ్రాముల నుంచి 60.4 గ్రాములకు, నగరాల్లో 53 గ్రాముల నుంచి 69.8 గ్రాములకు పెరిగింది.
Updated Date - Jul 04 , 2025 | 03:39 AM