PM Modi: మాల్దీవుల స్వాతంత్య్ర వేడుకలకు గౌరవ అతిథిగా మోదీ
ABN, Publish Date - Jul 27 , 2025 | 05:49 AM
మాల్దీవుల ప్రజల ఆకాంక్షలకు భారత్ అండగా ఉంటుందని ప్రధాని మోదీ చెప్పారు. ఆ దేశ స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన శనివారం ఆ దేశ ఉపాధ్యక్షుడు హుసేన్ మహమద్ లతీఫ్ సహా పలువురు నేతలను కలుసుకొన్నారు.
మాలె, జూలై 26: మాల్దీవుల ప్రజల ఆకాంక్షలకు భారత్ అండగా ఉంటుందని ప్రధాని మోదీ చెప్పారు. ఆ దేశ స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన శనివారం ఆ దేశ ఉపాధ్యక్షుడు హుసేన్ మహమద్ లతీఫ్ సహా పలువురు నేతలను కలుసుకొన్నారు. 60వ స్వాతంత్య్ర దిన వేడుకలు జరుపుకొంటున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు. అవసరమైన సమయంలో తమ దేశానికి భారత్ అండగా నిలుస్తున్నందుకు ప్రధానికి లతీఫ్ కృతజ్ఞతలు తెలిపారని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైశ్వాల్ ఒక సోషల్ మీడియా పోస్ట్లో పేర్కొన్నారు.
కాగా మాల్దీవుల స్వాతంత్య్ర వేడుకలు జరిగిన రిపబ్లిక్ స్క్వేర్లో ప్రధానికి ఆ దేశ అధ్యక్షుడు మహమద్ ముయిజ్జు, కీలక మంత్రులు సాదర స్వాగతం పలికారు. 50 నిమిషాలపాటు సాగిన స్వాతంత్య్ర వేడుకలను అధ్యక్షుడి పక్కనే కూర్చుని ప్రధాని వీక్షించారు. కాగా శుక్రవారం ముయిజ్జు, మోదీ మధ్య చర్చల ఫలితంగా మాల్దీవులు ఏటా చెల్లించాల్సిన రుణ మొత్తం 51 మిలియన్ డాలర్లకు బదులుగా 29 మిలియన్ డాలర్లకు అంటే 40 శాతం తగ్గించేందుకు భారత్ అంగీకరించింది. దీంతో ఆ దేశం ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు వీలవుతుంది.
Updated Date - Jul 27 , 2025 | 05:49 AM