Narendra Modi: సైప్రస్లో తుర్కియేకు మోదీ గట్టి సందేశం
ABN, Publish Date - Jun 17 , 2025 | 06:10 AM
ప్రధాని నరేంద్ర మోదీ సైప్రస్ పర్యటన దానికి పొరుగు దేశం తుర్కియేకు గట్టి సందేశమేనని విశ్లేషకుల అంచనా. 1974లో ఆ దేశంలోని మూడోవంతు భాగాన్ని తుర్కియే ఆక్రమించుకొంది.
త్వరలో ఈయూ కౌన్సిల్ బాధ్యతలు చేపట్టనున్న సైప్రస్
భారత్కు పలు అంశాల్లో అనుకూలం
న్యూఢిల్లీ, నికోసియా(సైప్రస్), జూన్ 16 : ప్రధాని నరేంద్ర మోదీ సైప్రస్ పర్యటన దానికి పొరుగు దేశం తుర్కియేకు గట్టి సందేశమేనని విశ్లేషకుల అంచనా. 1974లో ఆ దేశంలోని మూడోవంతు భాగాన్ని తుర్కియే ఆక్రమించుకొంది. అప్పటి నుంచి ఆ రెండు దేశాల మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. అంతేగాక భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమయంలో తుర్కియే పాకిస్థాన్కు అండగా నిలిచింది. అదే సమయంలో సైప్రస్ భారత్కు మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారత ప్రధాని సైప్రస్ పర్యటన అర్థవంతమైనదిగానే విశ్లేషకులు భావిస్తున్నారు. సైప్రస్ దేశ అధ్యక్షుడు నికోస్ క్రిస్టొడలిడీస్ ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోదీ 100 మంది అధికారుల బృందంతో ఆ దేశ పర్యటనకు వెళ్లడం విశేషం.
ఈ పర్యటన వ్యూహాత్మకంగా, దౌత్యపరంగా, ఆర్థికంగా, ప్రపంచ రాజకీయాల కోణంలోనూ కీలకమైనదిగా భావిస్తున్నారు. 2026లో సైప్రస్ యూరోపియన్ యూనియన్(ఈయూ) కౌన్సిల్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటనతో భారత్-ఈయూల మధ్య వాణిజ్యం, భద్రత అంశాల్లో మరింత మెరుగైన సహకారం పెంపొందేందుకు ఆ దేశం కృషి చేసే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి సైప్రస్ దేశ అత్యున్నత పురస్కారం ‘‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ మెకరియో్స-3’’ని ప్రదానం చేశారు. రెండు దేశాల మధ్య ఉన్న నిజమైన స్నేహానికి ఈ పురస్కారం నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు. రెండు దేశాల సంబంధాలు మరింత ఉన్నత స్థాయికి చేరతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
Updated Date - Jun 17 , 2025 | 06:10 AM