Shehbaz Sharif: మేం దాడి చేసేలోపే.. బ్రహ్మోస్తో కొట్టారు
ABN, Publish Date - May 30 , 2025 | 05:38 AM
ఆపరేషన్ సిందూర్లో భాగంగా భారత్ చేసిన దాడులతో తమ వైమానిక స్థావరాలకు జరిగిన నష్టంపై పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ నోరువిప్పారు. పాక్ సైన్యం మేల్కొనేలోపే బ్రహ్మోస్ క్షిపణులతో భారత్ విధ్వంసం సృష్టించిందని వెల్లడించారు.
మే 10న తెల్లవారుజామున భారత్పై దాడికి సిద్ధమయ్యాం
తొమ్మిదో తేదీ రాత్రే వ్యూహ రచన చేశాం
మాకన్నా ముందే భారత్ క్షిపణులతో విరుచుకుపడింది
మా వైమానిక స్థావరాలు ధ్వంసమయ్యాయి
భారత్ దాడులపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యలు
శాంతి చర్చలకు ముందుకు రావాలని భారత్కు పిలుపు
న్యూఢిల్లీ, మే 29: ఆపరేషన్ సిందూర్లో భాగంగా భారత్ చేసిన దాడులతో తమ వైమానిక స్థావరాలకు జరిగిన నష్టంపై పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ నోరువిప్పారు. పాక్ సైన్యం మేల్కొనేలోపే బ్రహ్మోస్ క్షిపణులతో భారత్ విధ్వంసం సృష్టించిందని వెల్లడించారు. తాము దాడి చేసే లోపే భారత్ బ్రహ్మోస్ ప్రయోగించి తమ వైమానిక స్థావరాలను ధ్వంసం చేసిందని పేర్కొన్నారు. పాకిస్థాన్-తుర్కియే-అజర్బైజన్ మధ్య అజర్బైజన్ వేదికగా బుధవారం జరిగిన త్రైపాక్షిక సదస్సులో షరీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. మే 10న తెల్లవారుజామున భారత్పై తాము దాడి చేద్దామని అనుకున్నామని, ఆ లోపే భారత్ దాడి చేసిందని తెలిపారు. ‘‘భారత్ చేస్తున్న దాడులకు బదులు చెప్పాలని మే 9వ తేదీ రాత్రి మేము నిర్ణయించుకున్నాం. 10వ తేదీ ఉదయం ప్రార్థనల అనంతరం, నాలుగున్నర గంటలకు దాడి చేసి శత్రువు(భారత్)కు పాఠం చెప్పాలని అనుకున్నాం. కానీ, దాని కంటే ముందే మా సైన్యం ఊహించని విధంగా భారత్ మరోసారి దాడి చేసింది.
రావల్పిండి విమానాశ్రయం సహా అనేక కీలక ప్రాంతాలపై బ్రహ్మోస్ క్షిపణులు ప్రయోగించింది’’ అని షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. దాడుల ప్రణాళికను తమ ఫీల్డ్ మార్ష ల్ ఆసిమ్ మునీర్ తనకు ముందుగానే చెప్పారని షరీఫ్ వివరించారు. ఇక, ఇరుదేశాల మధ్య దీర్ఘకాలిక సమస్యలైన కశ్మీర్, నీటివాటాలు, ఉగ్రవాదం అంశాలపై కూర్చొని మాట్లాడుకుందామంటూ పాక్ ప్రధాని ఈ సందర్భంగా మరోమారు భారత్ను కోరారు. శాంతి కోసం ఇరుదేశాలు మాట్లాడుకోవాలని, సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుందామని ప్రతిపాదించారు. ఐక్యరాజ్యసమితి, భద్రతా మండలి తీర్మానాలు, కశ్మీర్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కశ్మీర్ సమస్య పరిష్కారానికి సిద్ధమని అన్నారు. అలాగే, సీమాంతర ఉగ్రవాదంపైనా చర్చలకు సిద్ధమన్న షరీఫ్.. ఇరుదేశాల మధ్య వాణిజ్యం తిరిగి ప్రారంభం కావాలని ఆకాంక్షించారు. అదే సమయంలో పాక్ తాగు, సాగు నీటి అవసరాలకు ఎంతో కీలకమైన సింధు నదీ జలాల ఒప్పందం వి షయంలో భారత్ తీరును తీవ్రంగా విమర్శించారు.
అప్పటిదాకా మాటల్లేవ్ : భారత్
పాకిస్థాన్తో శాంతి చర్చల విషయంలో తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని భారత్ మరోసారి స్పష్టం చేసింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాకిస్థాన్ స్పష్టమైన, కఠినమైన చర్యలు తీసుకునేంత వరకు ఆ దేశంతో ఎలాంటి చర్చలు జరపబోమని పునరుద్ఘాటించింది. అలాగే, సీమాంతర ఉగ్రవాదానికి పాక్ మద్దతు ఇచ్చేంత వరకు సింధు నదీ జలా ల ఒప్పందం అమలు కాదని స్పష్టం చేసింది. ఉగ్రవాదులను అప్పగించడంతోపాటు పీవోకే(పాక్ ఆక్రమిత కశ్మీర్)ను ఖాళీ చేసిన తర్వాతే జమ్మూకశ్మీర్ అంశంపై చర్చిస్తామని తేల్చిచెప్పింది. శాంతి చర్చలకు భారత్ ముందుకు రావాలంటూ పాక్ ప్రధాని ఇచ్చిన పిలుపునకు భారత్ ఈ విధంగా స్పందించింది. భారత విదేశీ వ్యవహారాలశాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ ఈ మేరకు గురువారం విలేకరులతో మాట్లాడారు. నీళ్లు, రక్తం కలిసి ప్రవహించవని, ఉగ్రవాదం, చర్చలు కలిసి జరగవని, ఉగ్రవాదం, వాణిజ్యం ఒకే చోట ఉండవంటూ ప్రధాని మోదీ గతంలో చెప్పిన వ్యాఖ్యలను గుర్తు చేశారు.
Updated Date - May 30 , 2025 | 06:57 AM