Registered Post: రిజిస్టర్డ్ పోస్టు సేవ నిలిపివేత అంటూ వార్తలు.. అసలు విషయం ఏంటంటే..
ABN, Publish Date - Aug 09 , 2025 | 08:15 PM
రిజిస్టర్డ్ పోస్టు సేవ నిలిచిపోయిందంటూ సోషల్ మీడియాలో కలకలం రేగడంతో డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ తాజాగా స్పందించింది. ఈ సేవ రద్దు కాలేదని, స్పీడు పోస్టు సేవలో కేవలం విలీనం మాత్రమే అయ్యిందని వెల్లడించింది. స్పీడ్ పోస్టులో భాగంగా రిజిస్టర్డ్ పోస్టు సేవను కూడా ఎంచుకోవచ్చని వివరణ ఇచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: న్యాయ, ప్రభుత్వ వ్యవహారాలకు కీలకంగా ఉన్న రిజిస్టర్డ్ పోస్టు సేవ నిలిచిపోయిందంటూ ఇటీవల ఓ వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతూ కలకలం రేపింది. వాస్తవం ఏంటో తెలియక నెటిజన్లు కొందరు ఆందోళన చెందారు. ఈ విషయమై నెట్టింట కలకలం రేగిన నేపథ్యంలో ఇండియా పోస్టు తాజాగా క్లారిటీ ఇచ్చింది. రిజిస్టర్డ్ పోస్టు సేవ రద్దు కాలేదని, స్పీడ్ పోస్టుతో విలీనం మాత్రమే అయ్యిందని క్లారిటీ ఇచ్చింది.
లేఖపై పేర్కొన్న వ్యక్తులకే పోస్టు డెలివరీ అయ్యేందుకు అనేక మంది రిజిస్టర్డ్ పోస్టును వినియోగిస్తారని తెలిసిందే. న్యాయపరమైన వ్యవహారాల్లో రిజిస్టర్డ్ పోస్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే, లేఖలు వేగంగా డెలివరీ చేసేందుకు స్పీడ్ పోస్టు సేవను ప్రారంభించారు. పోస్టుపై ఉన్న అడ్రస్ ఆధారంగా డెలివరీ జరుగుతుంది. రిజిస్టర్డ్ పోస్టు డెలివరీ మాత్రం వ్యక్తి పేరు ఆధారంగా జరుగుతుంది. రిజిస్టర్డ్ పోస్టు విషయంలో వ్యక్తి ఐడెండిటీ చాలా కీలకం. దీంతో, ఈ సేవ నిలిచిపోయిందన్న అపోహ జనాల్లో వ్యాపించడంతో కలకలం రేగింది.
ఈ అంశంపై ఇండియా పోస్టు స్పష్టతను ఇచ్చింది. రిజిస్టర్డ్ పోస్టు సేవను స్పీడు పోస్టులో విలీనం చేసినట్టు పేర్కొంది. దీంతో, ఈ రెండు సేవలూ ఒకే గొడుగు కిందకు వచ్చినట్టు అయ్యిందని పేర్కొంది. స్పీడ్ పోస్టులో భాగంగా రిజిస్టర్డ్ పోస్టు సేవ యథాతథంగా కొనసాగుతుందని తెలిపింది. మరింత సమర్థవంతంగా సరళతరంగా పోస్టల్ కార్యకలాపాలు తీర్చిదిద్దేందుకు ఈ విలీనం దోహదపడుతుందని పేర్కొంది. ఇకపై స్పీడు పోస్టు సేవను ఎంచుకునే కస్టమర్లు రిజిస్టర్డ్ సేవను కూడా అవసరమైతే ఎంచుకోవచ్చు.
దీనితో పాటు పలు అదనపు ఫీచర్లు కూడా స్పీడు పోస్టు సేవలో అందుబాటులో ఉంటాయని పోస్టల్ శాఖ వెల్లడించింది. ఆన్లైన్ ట్రాకింగ్, రియల్ టైమ్ డెలివరీ అప్డేట్స్, ఓటీపీ ఆధారిత డెలివరీ, క్యాష్ ఆన్ డెలివరీ, రెగ్యులర్ యూజర్లకు క్రెడిట్ సౌకర్యం, భారీ పోస్టల్ ఆర్డర్లపై డిస్కౌంట్స్, కార్పొరేట్ క్లైంట్స్కు నేషనల్ అకౌంట్ ఫెసిలిటీ వంటివి అందుబాటులో ఉంటాయి.
ఇవి కూడా చదవండి
ఈ-ఆధార్ యాప్ అభివృద్ధిపై దృష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం
భయపెడుతున్న బాబా వాంగ జ్యోష్యం.. ఆగస్టులో ఏం జరగబోతోంది?..
For More National News and Telugu News
Updated Date - Aug 09 , 2025 | 08:25 PM