Cyber Fraud: డిజిటల్ అరెస్టు భయంతో కాంట్రాక్టు ఉద్యోగి ఆత్మహత్య
ABN, Publish Date - Jul 18 , 2025 | 06:06 AM
సైబర్ నేరగాళ్ల ఆగడాలకు విద్యుత్ శాఖ కాంట్రాక్టు ఉద్యోగి కె.కుమార్(48) బలయ్యాడు. కర్ణాటకలోని రామనగర్ జిల్లా చెన్నపట్టణ తాలూకా మళూరు హోబళి కలగేరి గ్రామానికి చెందిన కె.కుమార్ బెంగళూరు
బెదిరించి రూ.11 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు
బెంగళూరు, జూలై 17(ఆంధ్రజ్యోతి): సైబర్ నేరగాళ్ల ఆగడాలకు విద్యుత్ శాఖ కాంట్రాక్టు ఉద్యోగి కె.కుమార్(48) బలయ్యాడు. కర్ణాటకలోని రామనగర్ జిల్లా చెన్నపట్టణ తాలూకా మళూరు హోబళి కలగేరి గ్రామానికి చెందిన కె.కుమార్ బెంగళూరు హెచ్ఎ్సఆర్ లే అవుట్లోని విద్యుత్ శాఖ కార్యాలయంలో కాంట్రాక్టు పద్ధతిన గ్రూపు-డి ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఇటీవల కుమార్ మొబైల్కు ఓ వ్యక్తి కాల్ చేశాడు. విక్రమ్ గోస్వామిగా పరిచయం చేసుకుని, ఓ కేసులో అరెస్టు వారెంట్ జారీ అయిందని చెప్పాడు. ఆ కేసు నుంచి పేరు తొలగించాలంటే తన ఖాతాలో రూ.1.95 లక్షలు జమ చేయాలని సూచించాడు. కేసు అనగానే భయపడిన కుమార్, డబ్బులు సమకూర్చుకుని సైబర్ నేరగాడి ఖాతాలో జమచేశాడు. అంతటితో ఆగని సైబర్ నేరగాళ్లు.. వెంటనే రూ.2.75 లక్షలు సమకూర్చాలని, లేకుంటే మరో రోజులోనే అరెస్టు చేస్తామని బెదిరించారు.
ఇలా పలుమార్లు బెదిరింపు కాల్స్ రావడంతో కుమార్ దాచుకున్న సొమ్ముతోపాటు పలువురి వద్ద అప్పు చేసి సైబర్ నేరగాళ్లకు రూ.11 లక్షల దాకా ఇచ్చాడు. అయినా వేధింపులు ఆగలేదు. ఈ క్రమంలో ఈ నెల 14వ తేదీన స్వగ్రామానికి వెళుతున్నాని భార్యకు చెప్పి బెంగళూరు నుంచి వెళ్లిపోయాడు. మరుసటి రోజు స్వగ్రామంలోని సొంత పొలంలోనే చెట్టుకు ఉరివేసుకున్నట్టు గుర్తించారు. మృతుడి జేబులో సూసైడ్ నోట్ లభించింది. సీబీఐ పేరుతో వేధిస్తున్నారని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని అందులో పేర్కొన్నాడు.
Updated Date - Jul 18 , 2025 | 06:06 AM