Customs Duty Reduction: ముడి వంటనూనెలపై సుంకం తగ్గింపు
ABN, Publish Date - Jun 01 , 2025 | 04:56 AM
కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పామాయిల్, సోయాబీన్, సన్ఫ్లవర్ ముడి వంటనూనెలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని సగానికి తగ్గించింది. దీని ద్వారా రిటైల్ ధరలను తగ్గించి, దేశీయ తయారీదార్లకు రక్షణ కల్పించాలని ఉద్దేశం.
రిఫైండ్ ఆయిల్పై యథాతథం: కేంద్రం
న్యూఢిల్లీ, మే 31: విదేశాల నుంచి దిగుమతి చేసుకునే మూడు రకాల ముడి వంటనూనెలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని సగానికి సగం తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ముడి పామాయిల్, ముడి సోయాబీన్ నూనె, ముడి సన్ఫ్లవర్ నూనెలపై 20 శాతం మేర ఉన్న ‘బేసిక్’ కస్టమ్ డ్యూటీ’ని 10 శాతానికి తగ్గిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇతరత్రా పన్నులను కలుపుకొంటే దిగుమతి చేసుకునే ముడి నూనెపై ప్రస్తుతం ఉన్న 27.5శాతం సుంకం 16.5 శాతానికి తగ్గనుంది. వంట నూనెల రిటెయిల్ ధరలను తగ్గించడం, దేశీయ తయారీదార్లకు రక్షణ కల్పించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకొంది. దిగుమతి చేసుకునే రిఫైండ్ ఆయిల్పై విధించే సుంకాల్లో ఎలాంటి మార్పు చేయలేదు. రిఫైండ్ ఆయిల్పై 27.5శాతం బేసిక్ కస్టమ్స్ డ్యూటీ ఉండగా, ఇతరత్రా కలుపుకొంటే దిగుమతిదార్లు మొత్తంగా 35.75 శాతం చెల్లించాల్సి ఉంటుంది. దీంట్లో ఎలాంటి మార్పులు లేవు. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుంది. దేశ అవసరాల్లో 50 శాతం వంట నూనెలను విదేశాల నుంచే దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. 2023-24 మార్కెట్ సంవత్సరం (నవంబరు-అక్టోబరు నెలల మధ్యకాలం)లో రూ.1.32 లక్షల కోట్లు విలువచేసే 159.6 లక్షల టన్నుల వంట నూనెలను దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. మలేసియా, ఇండోనేసియా నుంచి పామాయిల్; అర్జెంటీనా, బ్రెజిల్ నుంచి సోయాబీన్ ఆయిల్ దిగుమతి అవుతోంది. ముడి వంటనూనెలు, రిఫైండ్ వంట నూనెలపై విధించే సుంకాల మధ్య తేడాను 8.25ు నుంచి 19.25ునికి పెంచడం సాహసోపేత నిర్ణయమని సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు సంజీవ్ ఆస్థానా అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి
శ్రీకాంత్ ఫ్యామిలీకి ప్రత్యేక పూజ.. అర్చకుడిపై వేటు
కలెక్టరేట్లో కరోనా.. ఐసోలేషన్కు ఉద్యోగులు
Read Latest AP News And Telugu News
Updated Date - Jun 01 , 2025 | 04:56 AM