Operation Sindhur: మన యుద్ధ విమానాలు కూలటం నిజమే
ABN, Publish Date - Jun 01 , 2025 | 04:48 AM
ఆపరేషన్ సిందూర్ సమయంలో కొంత భారత యుద్ధ విమానాలు కోల్పోయినట్లు సీడీఎస్ అనిల్ చౌహాన్ అంగీకరించారు. కానీ తప్పులనుంచి నేర్చుకుని వెంటనే దాడులు కొనసాగించి పాక్ పై భారీ దెబ్బతీశామని చెప్పారు.
ఆరు ఫైటర్లను కూల్చామన్న పాక్ ప్రకటన మాత్రం తప్పు
ఎన్ని ఫైటర్లు కూలాయన్నది కాదు, ఎందుకు కూలాయన్నదే ముఖ్యం
ఆరింటిని కూల్చామన్న పాక్ ప్రకటన తప్పు
వ్యూహపరమైన తప్పిదం జరిగింది.. వెంటనే సరిదిద్దాం
2 రోజుల్లోనే అన్ని విమానాలు ఎగిరి పాక్ను దెబ్బకొట్టాయి
ఆ దేశానికి చైనా ఇచ్చిన గగనతల వ్యవస్థలు పనిచేయలేదు
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ వెల్లడి
ఫైటర్లు కూలాయని తొలిసారి అధికారికంగా అంగీకారం
సింగపూర్, మే 31: ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ యుద్ధ విమానాలను కోల్పోయిందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ అంగీకరించారు. ఎన్ని యుద్ధ విమానాలను కోల్పోయినదీ వెల్లడించలేదు. నాలుగు రాఫెల్లు సహా ఆరు ఫైటర్లను కూల్చామని పాకిస్థాన్ చెబుతున్నది మాత్రం తప్పు అని స్పష్టం చేశారు. ఎన్ని ఫైటర్లు కూలాయన్నది ముఖ్యం కాదని, ఎందుకు కూలిపోయాయన్నది కీలకమని పేర్కొన్నారు. తప్పు ఎక్కడ జరిగిందో వెంటనే గుర్తించి సరిదిద్దుకున్నామని.. తర్వాత రెండు రోజుల్లోనే అన్ని రకాల విమానాలు, ఆయుధాలతో కచ్చితమైన దాడులు చేసి పాక్ను దెబ్బకొట్టామని తెలిపారు. పాక్తో నెలకొన్న ఉద్రిక్తతల్లో భారత్ యుద్ధ విమానాలను కోల్పోయిందన్న అంశాన్ని అధికారికంగా అంగీకరించడం ఇదే తొలిసారి. శనివారం సింగపూర్లో జరిగిన ‘షాంగ్రీ లా డైలాగ్ సెక్యూరిటీ ఫోరం’ సదస్సుకు హాజరైన సీడీఎస్ అనిల్ చౌహాన్.. అక్కడ బ్లూమ్బర్గ్ టీవీకి, రాయిటర్స్కు విడిగా ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆరు భారత యుద్ధ విమానాలను కూల్చామని పాకిస్థాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ చేసిన ప్రకటనను ప్రస్తావించగా.. ‘‘ఎన్ని విమానాలు కూలాయన్నది ముఖ్యం కాదు.. ఎందుకు కూలిపోయాయి, తప్పు ఎక్కడ జరిగిందన్నది ముఖ్యం. యుద్ధం జరిగినప్పుడు నష్టాలు ఉండక మానవు. మే 7న ఆపరేషన్ సిందూర్ మొదలైన సమయంలో భారత్కు కొంత నష్టం జరిగింది. ఆ నష్టాలకు కారణమేంటి, ఆ తర్వాత చేయాల్సినది ఏమిటి అనే దానిపై దృష్టిపెట్టాం. మేం చేసిన వ్యూహాత్మక తప్పిదం ఏమిటో వెంటనే గుర్తించి విశ్లేషించాం. దానిని వెంటనే సరిదిద్దుకున్నాం. రెండు రోజుల్లోనే అన్ని రకాల యుద్ధ విమానాలను ఆయుధాలతో రంగంలోకి తెచ్చాం’’ అని అనిల్ చౌహాన్ పేర్కొన్నారు. అయితే ఇరు దేశాల మధ్య అణుయుద్ధం జరిగేటువంటి పరిస్థితి ఏదీ తలెత్తలేదని అనిల్ చౌహాన్ చెప్పారు. భారత్-పాక్ మధ్య అణుయుద్ధాన్ని ఆపానని, కాల్పుల విరమణకు ఒప్పించానని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను తోసిపుచ్చారు.
చైనా రక్షణ వ్యవస్థలు పనిచేయలేదు!
పాక్లోని కీలక ఎయిర్బే్సలు, సైనిక స్థావరాల వద్ద గగనతల రక్షణ వ్యవస్థలు ఉన్నా.. వాటిని తప్పుదారి పట్టించి మరీ భారత్ దాడులు చేయగలిగిందని సీడీఎస్ అనిల్ చౌహాన్ చెప్పారు. పాకిస్థాన్ భూభాగంలో 300 కిలోమీటర్ల లోపలివరకు కూడా కేవలం ఒక మీటర్ తేడాతో కూడిన కచ్చితత్వంతో లక్ష్యాలను ధ్వంసం చేశామని వెల్లడించారు. పాక్కు చైనా అందించిన గగనతల రక్షణ వ్యవస్థలు పనిచేయలేదని పేర్కొన్నారు.
యుద్ధం ముదిరి.. కాల్పుల విరమణ జరిగి..
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్ చేపట్టిన భారత్.. మే 7న అర్ధరాత్రి పాకిస్థాన్లోని 9 ఉగ్ర స్థావరాలపై దాడి చేసిన విషయం తెలిసిందే. దీనికి ప్రతిగా పాక్ పెద్ద సంఖ్యలో ఆయుధ డ్రోన్లు, స్వల్ప శ్రేణి క్షిపణులతో భారత్పై దాడికి ప్రయత్నించింది. వాటిని చాలా వరకు ఎదుర్కొన్న భారత్ మే 9వ తేదీన అర్ధరాత్రి 11 పాక్ ఎయిర్బే్సలు, రాడార్, కమాండ్ కంట్రోల్ కేంద్రాలను ధ్వంసం చేసింది. దీనితో ఉద్రిక్తత మరింత పెరిగింది. ఇది పూర్తిస్థాయి యుద్ధంగా మారుతుందేమోనన్న సమయంలో.. ఒక్కసారిగా ఇరుపక్షాలు కాల్పుల విరమణ పాటించాలని నిర్ణయించాయి. మరోవైపు కాల్పుల విరమణ పాటించకపోతే భారీగా వాణిజ్య సుంకాలు విధిస్తామని తాను బెదిరించడంతోనే.. భారత్, పాక్ దిగొచ్చాయని ట్రంప్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
శ్రీకాంత్ ఫ్యామిలీకి ప్రత్యేక పూజ.. అర్చకుడిపై వేటు
కలెక్టరేట్లో కరోనా.. ఐసోలేషన్కు ఉద్యోగులు
Read Latest AP News And Telugu News
Updated Date - Jun 01 , 2025 | 04:48 AM