Balochistan: స్వతంత్ర దేశంగా బలూచిస్థాన్!
ABN, Publish Date - May 15 , 2025 | 05:40 AM
భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్తో ఇప్పటికే ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్థాన్కు మరో ఎదురుదెబ్బ తగిలింది.
తమను గుర్తించాలని భారత్, ఐక్యరాజ్యసమితికి ఆ ప్రాంత నేతల వినతి
న్యూఢిల్లీ, మే 14: భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్తో ఇప్పటికే ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్థాన్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్థాన్లోనే అతి పెద్ద ప్రావిన్స్(విస్తీర్ణం పరంగా) అయిన బలూచిస్థాన్.. పాకిస్థాన్ నుంచి విడిపోతున్నట్టు బలూచ్ నేతలు ప్రకటించారు. అంతేకాక బలూచిస్థాన్ను ప్రత్యేక దేశంగా గుర్తించాలని భారత్, ఐక్యరాజ్యసమితిని కోరారు. ఈ మేరకు బలూచిస్థాన్ నాయకుడు మీర్ యార్ బలూచ్ ఎక్స్లో పలు పోస్టులు చేశారు. రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్థాన్ ఏర్పాటును తన పోస్టుల్లో ప్రకటించారు. అలాగే, న్యూఢిల్లీలో బలూచిస్థాన్ రాయబార కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వాన్ని కోరారు.
తమను దేశంగా గుర్తించి.. కరెన్సీ, పాస్పోర్టు జారీ వంటి ప్రాథమిక అవసరాలకు నిధులు సమకూర్చాలని ఐక్యరాజ్యసమితిని అభ్యర్థించారు. అలాగే, తమను, పాకిస్థానీయులను ఒక్కటిగా చూడవద్దని భారత మీడియాను కోరారు. మీర్ యార్ బలూచ్ చేసిన పోస్టుల్లో పెద్దసంఖ్యలో ప్రజలు బలూచిస్థాన్ జెండాలు, స్వతంత్ర బలూచిస్థాన్ మ్యాపులు చూపిస్తున్న ఫొటోలు, వీడియోలు కూడా ఉన్నాయి. కాగా, కషిష్ చౌదరి(25) అనే పాకిస్థాన్కు చెందిన హిందూ యువతి బలూచిస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(బీపీఎస్సీ) పరీక్షలో ఉత్తీర్ణత సాధించి అసిస్టెంట్ కమిషనర్గా ఉద్యోగం పొందింది. బలూచిస్థాన్లో ఈ ఘనత సాధించిన తొలి మైనార్టీ మహిళగా కషీష్ చరిత్ర సృష్టించింది.
Updated Date - May 15 , 2025 | 05:40 AM