Doctors Resign from AIIMS: ఎయిమ్స్కు డాక్టర్లు బైబై
ABN, Publish Date - Aug 16 , 2025 | 02:38 AM
దేశంలో ఎంతో పేరు ప్రఖ్యాతలున్న అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ నుంచి డాక్టర్లు అర్ధంతరంగా నిష్క్రమిస్తున్నారు.....
రెండేళ్ల వ్యవధిలో 429 మంది రిజైన్
ఒక్క ఢిల్లీ నుంచే 52 మంది రాజీనామా
ప్రైవేట్కు వెళ్లిపోతున్న సీనియర్లు
న్యూఢిల్లీ, ఆగస్టు 15: దేశంలో ఎంతో పేరు ప్రఖ్యాతలున్న అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) నుంచి డాక్టర్లు అర్ధంతరంగా నిష్క్రమిస్తున్నారు. 2022-24 మధ్య 429 మంది వైద్యులు రిజైన్ చేశారు. పార్లమెంట్లో ఇటీవల ప్రభుత్వం వెల్లడించిన సమాచారం మేరకు ఒక్క ఢిల్లీ ఎయిమ్స్ నుంచే అత్యధికంగా 52 మంది రాజీనామా చేసి వెళ్లిపోయారు. రుషికేష్ నుంచి 38 మంది, రాయ్పూర్ నుంచి 35 మంది, బిలా్సపూర్ నుంచి 32 మంది, మంగళగిరి నుంచి 30 మంది, భోపాల్ నుంచి 27 మంది డాక్టర్లు ఎయిమ్స్కు బైబై చెప్పేశారు. ఢిల్లీ ఎయిమ్స్ నుంచి అత్యున్నత స్థాయిలో ఉన్న వారే ఎక్కువ మంది రిజైన్ చేశారని ఇండియా టుడే వార్తా సంస్థ పేర్కొంది. ఎయిమ్స్లో సీనియర్ డాక్టర్లు రూ. 2 లక్షల నుంచి రూ. 2.5 లక్షల వరకు అందుకుంటున్నారు. అదే ప్రైవేట్ ఆస్పత్రుల్లో సీనియర్ డాక్టర్లకు జీతం 4 నుంచి 10 రెట్లు ఎక్కువగా ఉంటోంది. దీంతో, ఎయిమ్స్ వైద్యులు ప్రైవేటుకు వెళ్లిపోతున్నారు. దీనికి కారణం నాయకత్వలోపమేనని రిజైన్ చేసి ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఓ సీనియర్ డాక్టర్ ఇండియా టుడేకు చెప్పారు. జీతాల కోసమే అంతా వెళ్లిపోవడంలేదని, నిబద్ధతతో పనిచేసిన వారు కూడా రాజకీయాలు, ఆశ్రిత పక్షపాతం కారణంగా ఎయిమ్స్ను విడిచిపేట్టేస్తున్నారని చెప్పారు. ఇక ఇటీవల తీసుకొచ్చిన రొటేటరీ హెడ్షిప్ పాలసీ కూడా వివాదాస్పద అంశమైంది. దీనిలో సమస్యలను ఆరోగ్య మంత్రిత్వ శాఖకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదని ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లిపోయిన ఓ సీనియర్ పేర్కొన్నారు. కాగా, సీనియర్లు రిజైన్లు చేయడంతో పైస్థాయిలో ఖాళీలు పెద్దసంఖ్యలో ఉండిపోతున్నాయి.
Updated Date - Aug 16 , 2025 | 02:39 AM