Intel: ఇంటెల్లో అమెరికాకు 10% వాటా
ABN, Publish Date - Aug 24 , 2025 | 01:11 AM
అమెరికాకు చెందిన అంతర్జాతీయ సెమీకండక్టర్ల (చిప్) తయారీ దిగ్గజం ఇంటెల్ కార్ప్లో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం 10 శాతం వాటా చేజిక్కించుకుంది.
వాషింగ్టన్: అమెరికాకు చెందిన అంతర్జాతీయ సెమీకండక్టర్ల (చిప్) తయారీ దిగ్గజం ఇంటెల్ కార్ప్లో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం 10 శాతం వాటా చేజిక్కించుకుంది. ఇంటెల్కు గతంలో ప్రకటించిన గ్రాంట్లను ఈక్విటీ వాటాగా మార్చుకుంది. యూఎస్ చిప్స్ అండ్ సైన్స్ చట్టంలో భాగంగా 570 కోట్ల డాలర్లు, భద్రమైన చిప్ల తయారీ కోసం ఏర్పాటు చేసిన సెక్యూర్ ఎన్క్లేవ్ ప్రోగ్రామ్లో భాగంగా 320 కోట్ల డాలర్లు కలిపి మొత్తం 890 కోట్ల డాలర్ల (రూ.77,875 కోట్లు)ను అమెరికా ప్రభుత్వం ఇంటెల్కు మంజూరు చేసింది.
ఇంకా విడుదల చేయాల్సి ఉన్న ఈ నిధులకు బదులుగా కంపెనీలోని 9.9 శాతం వాటాకు సమానమైన 43.33 కోట్ల షేర్లను ఒక్కొక్కటీ 20.47 డాలర్ల చొప్పున కేటాయించినట్లు ఇంటెల్ వెల్లడించింది. అయితే, కంపెనీలో ప్రభుత్వానికి బోర్డు సభ్యత్వం లేదా నియంత్రణ హక్కులు లభించవని ఇంటెల్ స్పష్టం చేసింది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యూఎస్ కార్పొరేట్ రంగంపై నియంత్రణ కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఇంటెల్లో వాటాను దక్కించుకున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.
Updated Date - Aug 24 , 2025 | 01:11 AM