Donald Trump: భారత్, పాక్ దాడులు ఆపేయాలి
ABN, Publish Date - May 09 , 2025 | 04:47 AM
భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. యూకే పార్లమెంట్లో కూడా ఈ అంశంపై చర్చ జరిగింది.
నేను ఏదైనా సాయం చేయగలిగితే చేస్తా: ట్రంప్
వాషింగ్టన్/లండన్, మే 8: భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఇరుదేశాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం ఆపాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఇందుకు నేనేదైనా సాయం చేయగలిగితే.. తప్పకుండా అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. బుధవారం ఓవల్ ఆఫీసులో మీడియా అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ‘భారత్, పాక్ మధ్య పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. రెండు దేశాల నుంచి గురించి నాకు బాగా తెలుసు. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని, పరస్పర దాడులు ఆపేయాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. తనకు రెండు దేశాలతో సత్సబంధాలు ఉన్నాయన్నారు. అంతకుముందు భారత్ దాడికి కొద్ది గంటల తర్వాత ట్రంప్ మాట్లాడుతూ భారత్, పాక్ దశాబ్దాలుగా పోరాడుతున్నాయని, ‘ఏదో జరగబోతోంది’ అనే విషయం ప్రజలకు తెలుసన్నారు. రెండు దేశాలకు ఏమైనా సందేశం ఇస్తారా? అని అడగ్గా.. ‘లేదు, ఇది చాలా త్వరగా ముగుస్తుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు. మరోవైపు భారత్, పాక్ మధ్య ఘర్షణపై యూకే పార్లమెంట్ చర్చించిది. ఉద్రిక్తతలు తగ్గించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని పార్టీలకు అతీతంగా సభ్యులు కోరారు. బుధవారం హౌస్ ఆఫ్ కామన్స్లో చర్చను ప్రారంభించిన యూకే విదేశాంగ మంత్రి హమిష్ ఫాల్కనర్ మాట్లాడుతూ భారత్, పాక్ సహనం పాటించాలన్నదే తమ స్థిరమైన సందేశమని అన్నారు.
లాహోర్ వీడండి.. తమ పౌరులకు అమెరికా సూచన
పాకిస్థాన్లోని గగనతల రక్షణ వ్యవస్థలను భారత్ ధ్వంసం చేయడంతో తమ పౌరులను అమెరికా అపమ్రత్తం చేసింది. లాహోర్ వీడాలని సూచించింది. లేదంటే సురక్షిత స్థావరాల్లో తలదాచుకోవాలని సూచించింది. దీనికి సంబంధించి లాహోర్లోని అమెరికా కాన్సులేట్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
Updated Date - May 09 , 2025 | 04:48 AM