US Bombing On Iran: ఇరాన్పై అమెరికా దాడి.. తీవ్రంగా ఖండించిన పాక్..
ABN, Publish Date - Jun 22 , 2025 | 03:48 PM
US Bombing On Iran: ఇరాన్ న్యూక్లియర్ బాంబు తయారు చేయటం ఇజ్రాయెల్కు గానీ, అమెరికాకు గానీ ఏ మాత్రం ఇష్టంలేదు. ఇరాన్ న్యూక్లియర్ బాంబులు తయారు చేసుకుంటే.. తమకు తీవ్ర నష్టం కలుగుతుందని ఇజ్రాయెల్ భావిస్తోంది.
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రువులు లేరని ఓ నానుడి ఉంది. అమెరికా, పాకిస్తాన్లను చూస్తే అది నిజమే అనిపిస్తుంది. నిన్నటి వరకు ఈ రెండు దేశాలు దోస్త్ మేరా దోస్త్ అన్నట్లు ఉన్నాయి. ట్రంప్కు నోబెల్ బహుమతి ఇవ్వాలని పాక్ కోరింది. కొన్ని రోజుల క్రితం పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్కు ట్రంప్ వైట్ హౌస్లో ప్రైవేట్ లంచ్ కూడా ఇచ్చారు. అయితే, సోదర దేశం ఇరాన్పై అమెరికా దాడులు చేయడంతో లెక్కలు మారిపోయాయి. ఇరాన్లోని న్యూక్లియర్ సైట్లపై అమెరికా దాడి చేయడాన్ని పాక్ తీసుకోలేకపోతోంది.
అమెరికా చర్యను తీవ్రంగా ఖండించింది. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి మాట్లాడుతూ..‘మేము ఇరాన్లో పెరగబోయే ఉద్రిక్తతల గురించే ఆలోచిస్తూ ఉన్నాము. ఇరాన్కు వ్యతిరేకంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు కలిచివేస్తున్నాయి. పరిస్థితులు తీవ్రంగా మారితే ఆ ప్రాంతం పెద్ద మొత్తంలో పాడవుతుంది. యూఎన్ ఛార్టర్ ప్రకారం.. ఇరాన్ తనను తాను డిఫెండ్ చేసుకునే హక్కు ఉంది’ అని పేర్కొన్నారు. కాగా, ఇరాన్, పాకిస్తాన్లు 900 కిలోమీటర్ల మేర సరిహద్దును పంచుకుంటున్నాయి. ఇరాన్ నష్టపోతే ఆ ప్రభావం పాకిస్తాన్ మీద కూడా పడుతుంది.
అందుకే ఈ యుద్ధం..
ఇరాన్ న్యూక్లియర్ బాంబు తయారు చేయటం ఇజ్రాయెల్కు గానీ, అమెరికాకు గానీ ఏ మాత్రం ఇష్టంలేదు. ఇరాన్ న్యూక్లియర్ బాంబులు తయారు చేసుకుంటే.. తమకు తీవ్ర నష్టం కలుగుతుందని ఇజ్రాయెల్ భావిస్తోంది. అందుకే 9 రోజుల క్రితం ఇరాన్ న్యూక్లియర్ సైట్లపై దాడులు చేసింది. అప్పటినుంచి యుద్ధం మొదలైంది. అమెరికా గతంలో ఇజ్రాయెల్కు సపోర్టుగా మాట్లాడింది. ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగింది. ఇరాన్ న్యూక్లియర్ సైట్లపై దాడులు చేసింది.
Updated Date - Jun 22 , 2025 | 03:48 PM