Duflo-Banerjee UZH: అమెరికా వీడనున్న నోబెల్ బహుమతి గ్రహీతలు.. ట్రంప్ ఆంక్షలే కారణమా
ABN, Publish Date - Oct 12 , 2025 | 10:46 AM
నోబెల్ బహుమతి గ్రహీతలు డుఫ్లో, బెనర్జీ దంపతులు అమెరికాను వీడనున్నారు. ప్రస్తుతం మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్లో పని చేస్తున్న వారు యూనివర్సిటీ ఆఫ్ జ్యూరిచ్లో చేరనున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన దంపతులు ఎస్తర్ డుఫ్లో, అభిజిత్ బెనర్జీలు అమెరికాను వీడనున్నారు. స్విట్జర్ల్యాండ్లోని యూనివర్సిటీ ఆఫ్ జూరిచ్లో ఏర్పాటు చేయనున్న కొత్త ఆర్థిక శాస్త్ర విభాగానికి నేతృత్వం వహించనున్నారు. ఈ మేరకు యూనివర్సిటీ ఆఫ్ జ్యురిచ్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం డుఫ్లో, అభిజిత్ బెనర్జీలు ఎమ్ఐటీలో ఉన్నారు. వచ్చే ఏడాది జులైలో ఫ్రొఫెసర్లుగా యూనివర్సిటీ ఆఫ్ జ్యూరిచ్లో చేరుతారు. అయితే, ఎమ్ఐటీలో కూడా పార్ట్టైమ్గా బాధ్యతలు నిర్వహిస్తారు. అమెరికా యూనివర్సిటీల నిధులకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోత పెడుతున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది (Duflo-Banerjee to Join UZH).
జ్యూరిచ్ యూనివర్సిటీలో ఏర్పాటు చేయబోయే లీమన్ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్, పబ్లిక్ పాలసీకి డుఫ్లో, బెనర్జీ దంపతులు నేతృత్వం వహించనున్నారు. పేదరికాన్ని నిర్మూలించే చర్యలపై పరిశోధనలను ప్రోత్సహించేందుకు, ప్రపంచవ్యాప్తంగా నిపుణుల ఈ విషయంలో అనుసంధానం చేసేందుకు వారు కృషి చేస్తారు.
అమెరికాలోని పలు ప్రముఖ యూనివర్శిటీల విధానాలతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విభేదిస్తున్న విషయం తెలిసిందే. ఇది అధ్యాపకులు, స్టూడెంట్లకు ఉన్న విద్యాపరమైన స్వాతంత్ర్యాన్ని అణచివేయడమేనన్న ఆందోళన అగ్రరాజ్యంలో పెరుగుతోంది. ఫలితంగా మేధావులు అమెరికాను వీడి ఇతర దేశాలకు తరలిపోతారన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే పలు దేశాల్లో అమెరికాలోని వృత్తి నిపుణులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అమెరికా ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ Le Monde న్యూస్పేపర్లో ప్రచురితమైన ఎడిటోరియల్ వ్యాసానికి మద్దతుగా డుఫ్లో సంతకం కూడా చేయడం కొసమెరుపు. ఇక ఈ ఏడాది ఆర్థికశాస్త్ర రంగంలో నోబెల్ బహుమతి విజేతలను సోమవారం ప్రకటించనున్నారు.
ఇవి కూడా చదవండి:
అఫ్ఘాన్, పాక్ దళాల పరస్పర దాడులు.. 12 మంది పాక్ సైనికుల మృతి
మా పాత్ర ఏమీ లేదు.. అప్ఘాన్ ప్రెస్ మీట్పై కేంద్రం వివరణ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Oct 12 , 2025 | 10:46 AM