PM Khaleda Zia Passes Away: ఖలీదా జియా కన్నుమూత
ABN, Publish Date - Dec 31 , 2025 | 04:13 AM
బంగ్లాదేశ్ మొదటి మహిళా ప్రధాని బేగం ఖలీదా జియా(80) మంగళవారం కన్నుమూశారు. చాలాకాలంగా ఆమె క్యాన్సర్తో బాధపడుతున్నారు...
క్యాన్సర్తో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని మృత్యువాత.. ప్రధాని మోదీ, రాహుల్ సంతాపం
ఢాకా, డిసెంబరు 30: బంగ్లాదేశ్ మొదటి మహిళా ప్రధాని బేగం ఖలీదా జియా(80) మంగళవారం కన్నుమూశారు. చాలాకాలంగా ఆమె క్యాన్సర్తో బాధపడుతున్నారు. బంగ్లాదేశ్లో వరుస కుట్రలు, మిలిటరీ పాలనల తర్వాత 1991లో స్వేచ్ఛగా జరిగిన ఎన్నికల్లో ఆమె ఘన విజయం సాధించారు. రెండు పర్యాయాలు(1991-96, 2001-2006) ప్రధానమంత్రిగా పని చేశారు. ప్రవాసం నుంచి ఇటీవలే బంగ్లాదేశ్కు తిరిగివచ్చిన ఆమె తనయుడు, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) అధినేత తారిఖ్ రెహమాన్ తన తల్లి మరణాన్ని ధ్రువీకరించారు. ఢాకాలోని ఎవర్కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారని వ్యక్తిగత వైద్యుడు తెలిపారు. ఖలీదా జియా అంత్యక్రియలు బుధవారం నిర్వహిస్తారు. ఆమె భర్త, బీఎన్పీ వ్యవస్థాపకుడు జియావుర్ రెహమాన్ సమాధి పక్కనే ఆమె అంతిమ సంస్కారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు రోజులపాటు జాతీయ సంతాప దినాలు పాటిస్తున్నట్లు బంగ్లాదేశ్ తాత్కాలిక పాలకుడు మహమ్మద్ యూనస్ ప్రకటించారు. ఎలాంటి ఉద్రిక్తతలకు తావు లేకుండా అంత్యక్రియల్లో పాల్గొనాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. గత ఏడాది కాలంగా బంగ్లాదేశ్లో రాజకీయ అస్థిరత నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో జరగబోయే ఎన్నికల్లో బీఎన్పీ అధికారంలోకి వస్తుందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. ఖలీదా ఆరోగ్యంగా ఉంటే ఆమే ప్రధానమంత్రి అయ్యేవారు. ఖలీదా మరణం పట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఇరు దేశాల సంబంధాలను బలోపేతం చేయడంలో ఆమె పాత్ర కీలకమైనదని కొనియాడారు. రాహుల్గాంధీ కూడా విచారం వ్యక్తం చేశారు. భారతదేశం నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ ఆమె అంత్యక్రియలకు హాజరవుతున్నారు. ఖలీదా మృతి పట్ల హసీనా సంతాపం తెలిపారు.
బలవంతంగా రాజకీయాల్లోకి...
బంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్న బీఎన్పీ అధినేత జియావుర్ రహమాన్ 1981లో సైనిక తిరుగుబాటులో హత్యకు గురికావడంతో గృహిణిగా ఉన్న ఖలీదా 35 ఏళ్ల వయస్సులో తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. సైనిక పాలనకు వ్యతిరేకంగా ఖలీదా జియా దశాబ్దకాలం పాటు రాజకీయ పోరాటం చేశారు. 1990లో బంగ్లాదేశ్లో మిలిటరీ పాలన మీద ప్రజలు తిరుగుబాటు చేయడంతో షేక్ హసీనా(అవామీ లీగ్), ఖలీదా జియా చేయి కలిపారు. చీఫ్ జస్టిస్ నేతృత్వంలో తటస్థ ప్రభుత్వం ఆధ్వర్యంలో 1991లో నిష్పాక్షికంగా జరిగిన ఎన్నికల్లో ఖలీదా జియా నేతృత్వంలోని బీఎన్పీ అధికారంలోకి వచ్చింది. 1996 ఎన్నికల్లో హసీనా నేతృత్వంలోని అవామీలీగ్, 2001లో ఖలీదా నేతృత్వంలో బీఎన్పీ గెలిచాయి. 2006లో మళ్లీ సైన్యం అధికారాన్ని చేజిక్కించుకుంది. రెండేళ్లు పాలించింది. ఈ క్రమంలోనే 2007లో అవినీతి ఆరోపణలపై ఖలీదాను జైల్లో పెట్టారు. 2009లో హసీనా మళ్లీ ప్రధాని అయి గతేడాది ప్రజా తిరుగుబాటు జరిగేవరకు కొనసాగారు. 2014, 2024 ఎన్నికలను ఖలీదా నేతృత్వంలోని బీఎన్పీ బహిష్కరించింది.
Updated Date - Dec 31 , 2025 | 04:13 AM