Mob violence: సహచరులే కుట్రదారులు
ABN, Publish Date - Dec 23 , 2025 | 03:40 AM
బంగ్లాదేశ్లో ఇస్లామిక్ అతివాదుల చేతిలో మూక హత్యకు గురైన హిందూ యువకుడు దీపుచంద్రదాస్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి...
బంగ్లాదేశీ హిందువు దీపుదాస్ మూకహత్యలో సంచలన విషయాలు
ఉద్యోగానికి బలవంతంగా రాజీనామా చేయించిన తోటి ఉద్యోగులు
ఆపై అల్లరిమూకకు అప్పగింత
బంగ్లాదేశ్ పోలీసుల వెల్లడి.. దైవదూషణపై ఆధారాలు లేవని స్పష్టీకరణ
న్యూఢిల్లీ, డిసెంబరు 22: బంగ్లాదేశ్లో ఇస్లామిక్ అతివాదుల చేతిలో మూక హత్యకు గురైన హిందూ యువకుడు దీపుచంద్రదాస్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతడు అసలు దైవదూషణకు పాల్పడిన ట్లు ఎలాంటి ఆధారాలూ లేవని ఆ దేశ అధికారులు తెలిపారు. అంతేకాదు దీపుదాస్ పనిచేసే బట్టల కంపెనీలోని తోటి ఉద్యోగులే అతడి చేత బలవంతంగా ఉద్యోగానికి రాజీనామా చేయించి, అల్లరిమూకకు అతడిని అప్పగించినట్లు బంగ్లాదేశ్ రాపిడ్ యాక్షన్ బెటాలియన్(రాబ్) పోలీసులు వెల్లడించారు. అంతటితో ఆగకుండా అల్లరిమూకతో కలిసిపోయి దీపుదా్సపై వారు కూడా దాడి చేసి కొట్టిచంపారని తెలిపారు. ఈ నెల 16న మైమెన్సింగ్ ప్రాంతంలోని భలుకాలో ఇస్లామిక్ అల్లరి మూకలు దీపుదా్సను కొట్టిచంపి, అతడి మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీసి తగులబెట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటన అనుకోకుండా జరిగింది కాదని.. పథకం ప్రకారం చేసినట్లు కనిపిస్తోందని రాబ్-14 కమాండర్ నైముల్ హసన్ పేర్కొన్నారు. ‘16న సాయంత్రం 4 గంటల సమయంలో ఈ దాడి మొదలైంది. కంపెనీలో పనిచేసే ఫ్లోర్ ఇన్చార్జి మొహ్మద్ అలంఘిర్ హొస్సైన్, క్వాలిటీ ఇన్చార్జి మొహ్మద్ మిరాజ్ హొస్సైన్ అలోక్, మరికొంతమంది ఉద్యోగులు కలిసి.. దైవదూషణకు పాల్పడ్డారన్న నెపంతో దీపుదాస్ చేత బలవంతంగా రాజీనామా చేయించారు. పోలీసులకు సమాచారం కూడా ఇవ్వకుండా నేరుగా అల్లరిమూకకు అప్పగించారు. అప్పటికే కంపెనీ ముందు వందలమంది గుమికూడారు. ఆగ్రహంతో ఉన్న వారంతా కంపెనీ గేటును ధ్వంసం చేసి లోపలికి వచ్చి దీపును బయటకు లాక్కెళ్లారు. దీపును దారుణంగా కొట్టిచంపి రాత్రి 8.45 గంటల సమయంలో మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీసి నిప్పు పెట్టారు’ అని ఆయన వివరించారు. దీపూ హత్యకు నిరసనగా బంగ్లాదేశ్లో సోమవారం మైనారిటీ వర్గాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. కలకత్తాలోని బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషన్ కార్యాలయం వద్ద బీజేపీ నేతృత్వంలో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. మరోవైపు, భారత్లోని తన వీసా సర్వీసులను బంగ్లాదేశ్ ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది.
మరో విద్యార్థి నాయకుడిపై కాల్పులు
విద్యార్థి నేత షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్యతో బంగ్లాదేశ్లో హింసాత్మక ఆందోళనలు జరుగుతున్న వేళ.. మరో విద్యార్థి, కార్మిక నాయకుడిపై కాల్పులు చోటుచేసుకోవడం మరింత ఉద్రిక్తతలు రాజేసింది. బంగ్లాదేశ్కు చెందిన నేషనల్ సిటిజన్స్ పార్టీ (ఎన్సీపీ) సీనియర్ నేత మోతాలెబ్ సికదర్ (42)పై సాయుధ దుండగులు కాల్పులు జరిపారు. సోమవారం మధ్యాహ్నం ఖులానా పట్టణంలోని ఆయన ఇంటి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో బుల్లెట్ సికదర్ తల ఎడమ భాగాన్ని తాకగా.. అతనికి తీవ్ర గాయాలయ్యాయి.
బంగ్లాదేశీవా అంటూ మూకదాడి
కేరళలో యువకుడి మృతి
బంగ్లాదేశీయుడు అన్న అనుమానంతో కొందరు దుండగులు జరిపిన మూకదాడిలో ఛత్తీ్సగఢ్కు చెందిన దళిత యువకుడు రామ్నారాయణ్ బఘేల్ ప్రాణాలు కోల్పోయాడు. కేరళలోని పాలక్కాడ్ జిల్లా అట్టప్పల్లంలో బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ‘నువ్వు బంగ్లాదేశీవా’ అని భఘేల్ను కొందరు తీవ్రంగా కొట్టటం ఆ వీడియోలో కనిపించింది. దెబ్బలకు తాళలేక అతడు కుప్పకూలగా స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బఘేల్ ప్రాణాలు కోల్పోయాడు.
Updated Date - Dec 23 , 2025 | 03:40 AM