Bilawal Bhutto: మళ్లీ మాటమార్చిన బిలావల్ భుట్టో.. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటం చేద్దామని పిలుపు
ABN, Publish Date - Jul 02 , 2025 | 07:53 PM
కశ్మీర్ వివాదం, పహల్గాం ఉగ్రదాడి అనంతరం సింధు జలాల ఒప్పందం నిలిపివేత వంటి అంశాలతో సహా చిరకాల సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని భుట్టో పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కశ్మీర్ అంశాన్ని ఇరుదేశాలు పరిష్కరించుకోవాలన్నారు.
ఇస్లామాబాద్: భారత్-పాక్ మధ్య ఇటీవల నెలకొన్న ఉద్రిక్తతలు, సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేయడంపై నోరు పారేసుకున్న పాకిస్థాన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్లో (Bilawal Bhutto) మరోసారి 'యూ టర్న్' తీసుకున్నారు. ఉగ్రవాదంపై సంయుక్త పోరాటం చేద్దామని భారత్కు పిలుపునిచ్చారు. ఉగ్రవాదంపై పోరాటం, ప్రాంతీయ శాంతిని పొందించడం ద్వారా చారిత్రక, అసాధారణ భాగస్వామ్యాన్ని పటిష్టం చేసేందుకు పాకిస్థాన్తో కలిసిరావాలని భారత్ను కోరారు. 'పాకిస్థాన్ ఫైటింగ్ వార్ ఫర్ ది వరల్డ్ ఎగైనెస్ట్ టెర్రరిజం' అనే అంశంపై ఇస్లామాబాద్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, విభేదాలకు అతీతంగా పరస్పర సహకారానికి ముందుకు రావాలని ఇండియాను కోరారు.
'ఉగ్రవాదంపై సంయుక్త పోరాటంలో ఇండియాతో చారిత్రక, అసాధారణ భాగస్వామానికి పాకిస్థాన్ సిద్ధంగా ఉంది. ప్రతికూలతల వల్ల కలిసొచ్చేదేమీ లేదు. ఉగ్రవాదం అనే ప్లేగు మహమ్మారి నుంచి లక్షలాది మందిని కాపాడేందుకు ఇరుగుపొరుగు దేశాలు నైతిక, నాకరికతా బాధ్యతలు షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఘర్షణాత్మక వైఖరిని భారతదేశ న్యాయకత్వం విడిచిపెట్టాలి' అని భుట్టో అన్నారు.
వివాదాలపై..
కశ్మీర్ వివాదం, పహల్గాం ఉగ్రదాడి అనంతరం సింధు జలాల ఒప్పందం నిలిపివేత వంటి అంశాలతో సహా చిరకాల సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని భుట్టో పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కశ్మీర్ అంశాన్ని ఇరుదేశాలు పరిష్కరించుకోవాలని, జలాలకు సంబంధించిన ఉద్రిక్తతలు తగ్గేందుకు సహకరించుకోవాలని సూచించారు. 'హిమాలయాల కంటే ఎత్తుగా శాంతిని పాదుకొలుపుదాం. సింధు నాగరికతతో వేళ్లూనుకున్న సంప్రదాయాన్ని తిరిగి పాదుకొలుపుదాం. స్నేహహస్తం చాపడం బలహీనత కాదు..తెలివైన పని' అని భుట్టో అన్నారు.
పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) చైర్మన్ అయిన బిలావల్ భుట్టో ఇటీవల సింధు జలాల ఒప్పందం రద్దుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'నదిలో మా జలాలు పారకపోతే.. రక్తం పారుతుంది' అంటూ భారత్పై అక్కసు వెళ్లగక్కారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం కాదని, ప్రజల అభిప్రాయాన్ని తాను చెప్పానని మాట మార్చారు.
షేక్ హసీనాకు 6 నెలల జైలు శిక్ష
పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించిన క్వాడ్ దేశాలు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 02 , 2025 | 07:59 PM