Artificial Sweeteners: కూల్డ్రింక్స్తో డిమెన్షియా ముప్పు
ABN, Publish Date - Aug 06 , 2025 | 05:52 AM
రోజూ శీతల పానీయాలు తాగడం వల్ల పక్షవాతం, డిమెన్షియా వచ్చే అవకాశం ముడింతలు పెరుగుతుందని
డైట్ సోడాతోనూ అంతే నష్టం
న్యూఢిల్లీ, ఆగస్టు 5: రోజూ శీతల పానీయాలు తాగడం వల్ల పక్షవాతం, డిమెన్షియా వచ్చే అవకాశం ముడింతలు పెరుగుతుందని, డైట్ సోడాతోనూ అంతే ప్రమాదమని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ మాస పత్రికలో ఈ అధ్యయన నివేదిక ప్రచురితమయింది. అధ్యయనకారులు 45 ఏళ్లు దాటిన 2,800 మందిని పదేళ్లపాటు పరిశీలించారు. వారి పరిశోధనలో దిగ్ర్భాంతికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ‘‘కూల్ డ్రింక్ తాగిన ఒక గంటలో మన శరీరంలో 10 టీ స్పూన్ల షుగర్ డంప్ అవుతుంది. 20 నిమిషాల్లో రక్తంలో షుగర్ శాతం పెరుగుతుంది. భారీగా పెరిగిన ఇన్సులిన్కు అనుగుణంగా మన శరీరం స్పందిస్తుంది. సుమారు 40 నిమిషాలకు కెఫిన్ మన రక్తంలోకి పూర్తిగా ఇంకుతుంది. ఇది మన రక్తపోటును (బీపీ) పెంచుతుంది. లివర్ను ట్రిగ్గర్ చేయడంతో రక్తంలోకి మరింత షుగర్ విడుదల అవుతుంది. బ్రెయిన్లోని సంతోష కేంద్రాలను డొపమైన్ ఉత్తేజపరుస్తుంది. 60 నిమిషాల తరువాత కాల్షియం, మరికొన్ని కీలక లవణాలతో కలసి ఫాస్ఫారిక్ యాసిడ్ మన పేగుల్లో అట్టకడుతుంది. మూత్రవిసర్జన అవసరాన్ని కెఫిన్ ప్రేరేపించడంతో అవి మూత్రం ద్వారా బయటకు వెళ్లడం ప్రారంభమవుతుంది’’ అని ఆ అధ్యయనం వివరించింది. ‘‘డైట్ సోడాలు తాగేవాళ్లకు వాటిలోని కృత్రిమ స్వీట్నర్లతో పక్షవాతం, డిమెన్షియా వచ్చే ప్రమాదం మూడింతలు పెరుగుతుంది’’ అని తెలిపింది. శీతల పానీయాలు/డైట్ సోడాలతో నేరుగా ప్రమాదం జరుగుతుందని చెప్పలేం కానీ, ప్రమాద ఉత్ర్పేరకాలుగా పనిచేస్తాయని మాత్రం చెప్పవచ్చని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ మాస పత్రికలో ప్రచురితమైన వ్యాసం పేర్కొంది.
Updated Date - Aug 06 , 2025 | 05:52 AM