Delhi Blast 2025: వైఫల్యం – విషాదం
ABN, Publish Date - Nov 14 , 2025 | 04:04 AM
ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. పదమూడుమందిని పొట్టనబెట్టుకొని, తీవ్రగాయాలతో అనేకులను ఆస్పత్రిపాల్జేసిన ఈ దారుణంలో కుట్రదారులను, కార్యకర్తలనూ వెతికిపట్టుకొనే ప్రయత్నం ముమ్మరంగా సాగుతోంది.
ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. పదమూడుమందిని పొట్టనబెట్టుకొని, తీవ్రగాయాలతో అనేకులను ఆస్పత్రిపాల్జేసిన ఈ దారుణంలో కుట్రదారులను, కార్యకర్తలనూ వెతికిపట్టుకొనే ప్రయత్నం ముమ్మరంగా సాగుతోంది. పదిమందిని అనుమానితులుగా అరెస్టు చేయడంతో పాటు, ఢిల్లీ పోలీసులు కొన్ని ప్రాంతాల్లో హోటళ్ళనూ, నివాసగృహాలను ఇంకా జల్లెడపడుతున్నారు. కశ్మీర్లోనూ గాలింపు కొనసాగుతోంది. ఆర్డీఎక్స్ స్థానంలో అతి సులువుగా అందుబాటులో ఉండే అమ్మోనియం నైట్రేట్తో ఆ దుర్మార్గులు ఇంతటి ఘోర విధ్వంసాన్ని సృష్టించారు. వీరి ఉన్మాదానికి సామాన్యులు, ఆటోడ్రైవర్లు, దుకాణదారులు బలైపోయారు. కొన్ని వందలమీటర్ల దూరంవరకూ శరీర అవయవాలు తెగినపడిన ఆ భీతావహదృశ్యాలు మనలను దీర్ఘకాలం వెంటాడతాయి. జవాబులేని ప్రశ్నలు అనేకం మిగిలే ఉన్నాయి. ఈ విస్ఫోటనానికి ముందు కశ్మీర్లో ఏడుగురు అరెస్టుకావడం, ఫరీదాబాద్లో భారీగా పేలుడుపదార్థాలు దొరకడం వంటి పలు పరిణామాలను గుదిగుచ్చే ప్రయత్నం సాగుతోంది. ఇటువంటి ఘటనలు జరగ్గానే, విధ్వంసం తీవ్రత, విధానాలను బట్టి దర్యాప్తు సంస్థలు కొద్దిగంటల్లోనే దానిని ఉగ్రవాదచర్యగా గుర్తించడం, ఏ సంస్థ ఉన్నదో అంచనాకట్టడం జరిగిపోతుంది. ఎర్రకోట ఘటనలో ఢిల్లీ పోలీసులు, ఎన్ఐఏ నోరువిప్పడంలేదు. దీంతో తనకు అనధికారికంగా తెలిసినదానినో, ఊహించినదానినో మీడియా చెప్పుకుంటోంది. డిసెంబరు 6న ముప్పైకిపైగా వరుసపేలుళ్ళతో విధ్వంసాన్ని సృష్టించడానికి ఈ మతోన్మాదులు సర్వం సిద్ధం చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఒక్కకారుతో, అదీ హడావుడిలోనే ఇంతటి వినాశనం కలగచేయగలిగిన ఆ దుర్మార్గుల అసలు లక్ష్యం నెరవేరినపక్షంలో ఎంతటి ప్రాణనష్టం జరిగివుండేదో తలుచుకుంటేనే భయం కలుగుతుంది. జమాతే ఇస్లామీ, జైషే మహ్మద్ వంటి సంస్థలతో పాటు, తుర్కియే తోడ్పాటు కూడా ఉన్నట్టు వింటున్నాం. దారుణం జరగ్గానే కుట్ర, భయానకం వంటి మాటలు మాత్రమే వాడిన పాలకులు రెండురోజులకు గానీ ఉగ్రచర్యగా గుర్తించలేదు. ఇంతలోగా ప్రధాని మోదీ భూటాన్ కూడా వెళ్ళి, కుట్రదారులను వదిలేది లేదని అక్కడ ఓ భీషణ ప్రతిజ్ఞచేశారు. ఎన్ఐఏకు కేసు అప్పగించడం, ఊపావంటి చట్టాలను ప్రయోగించడం కుట్రదారులమీద వదిలిపెట్టకుండా ఉండటానికే.
క్రమంగా పాక్పాత్ర, జైషే హస్తం, ముంబైతరహా మరో విధ్వంసానికి విస్తృతమైన ప్రణాళిక ఇందులో స్పష్టం కావడంతో ఉగ్రవాదం అనకతప్పలేదు. ఆపరేషన్ సిందూర్ జోరుగా సాగుతూండగా, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అది ఆగిపోయిందని ముందే ప్రకటించి మన పాలకులను ఇరకాటంలో పడేశారు. ఆ తరువాత ఆయన ఓ యాభైసార్లు తానే యుద్ధాన్ని ఆపాననీ చెప్పుకున్నారు. ఇక చాలు మహాప్రభో అని పాక్ మిలటరీ అధికారులు ప్రాధేయపడడంతో తామే సిందూర్ను ఆపామని మన నాయకులు చెప్పుకున్నారు. ఇకపై ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వబోమన్న కనీస హామీ కూడా లేకుండా, కేవలం శత్రువు బతిమాలితే యుద్ధం ఆపేయడమేమిటని విపక్షాలు నిలదీశాయి. ఇకపై ఉగ్రచర్యలన్నీ యుద్ధచర్యలుగానే పరిగణిస్తామని స్వయంగా ప్రధాని ప్రకటించారు. ఈ నేపథ్యంలో, ఎర్రకోట ఘటనను ఉగ్రచర్యగా గుర్తించడం ప్రభుత్వానికి ఒక విధంగా ఇబ్బందే. ట్రంప్తో వీసమెత్తు సయోధ్యలేని స్థితిలో, ఆయన పూర్తిగా పాకిస్థాన్ పక్షాన, మార్షల్ మునీర్ ప్రేమలో తేలుతున్న తరుణంలో గతంలో మాదిరిగా సిందూర్లు సాధ్యం కాదు. పాలకులు కూడా కుట్రదారులకు ప్రభుత్వ ఏజెన్సీలు తగిన గుణపాఠం చెబుతాయని మాత్రమే అంటున్నారు. ఒక మహా విధ్వంసం దిశగా సాగుతున్న కుట్ర ముందుగానే ఎర్రకోటవద్ద బద్దలుకావడం ఒక విధంగా ఉపశమనం కలిగించేదే. అయితే, రోజంతా భారీ పేలుడుపదార్థాలతో ఒక వ్యక్తి కీలకమైన ప్రాంతాల్లో సంచరించగలగడం మన నిఘావైఫల్యానికి నిదర్శనం. దీనికి పదిరోజులముందే కశ్మీర్, ఫరీదాబాద్లో ఉగ్రచర్యలను పోలీసులు భగ్నం చేసినా, దూరదృష్టి, సమన్వయం, సమాచార లోపంతో ఈ దారుణాన్ని నిలువరించలేకపోవడం అతిపెద్ద విషాదం. శక్తిమంతమైన లెఫ్ట్నెంట్ గవర్నర్ ఉన్న జమ్మూకశ్మీర్, బీజేపీ పాలిత హర్యానా, యూపీ, ఢిల్లీలమీదుగా ఈ ఉగ్రకుట్ర సాగడంతో విపక్షాలు పుల్వామా, పహల్గాం వైఫల్యాలను కూడా గుర్తుచేస్తూ కేంద్రాన్ని ఘాటుగా విమర్శించడం సహజం.
Updated Date - Nov 14 , 2025 | 04:09 AM