Tirumala: టీటీడీలో పనిచేస్తూ.. చర్చిలో ప్రార్థనలు
ABN, Publish Date - Jul 09 , 2025 | 04:55 AM
టీటీడీ ఉద్యోగిగా పనిచేస్తూ చర్చికి వెళుతున్నారన్న అభియోగంపై అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(ఏఈవో) రాజశేఖర్ బాబును సస్పెండ్ చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది.
ఏఈవో రాజశేఖర్బాబు సస్పెన్షన్
తిరుమల, జూలై 8(ఆంధ్రజ్యోతి): టీటీడీ ఉద్యోగిగా పనిచేస్తూ చర్చికి వెళుతున్నారన్న అభియోగంపై అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(ఏఈవో) రాజశేఖర్ బాబును సస్పెండ్ చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. టీటీడీ వేలం విభాగంలో ఏఈవోగా పనిచేస్తున్న రాజశేఖర్బాబు పుత్తూరులోని ఆయన స్వగ్రామంలో ప్రతి ఆదివారం చర్చికి వెళ్లి ప్రార్థనల్లో పాల్గొంటున్నారంటూ వీడియోలు, ఫొటోలు సహా ఓ వ్యక్తి టీటీడీకి ఫిర్యాదు చేశారు. దీనిపై రాధామనోహర్ దాస్ కూడా స్పందించారు. టీటీడీలో పనిచేస్తూ స్వామి సొమ్ము తింటూ, హుండీలో హిందువులు కానుకలు సమర్పిస్తే.. దాంతో జీతం తీసుకుంటూ చర్చిలకు వెళ్లే ఉద్యోగులు చర్చిలను వదిలేయాలని, లేకుంటే టీటీడీని వదిలేయాలని మీడియా ఎదుట డిమాండ్ చేయడం తీవ్రస్థాయిలో చర్చనీయాంశమైంది. రాజశేఖరబాబు చర్చికి వెళ్తున్నట్లు టీటీడీ విజిలెన్స్ అధికారుల విచారణలో కూడా తేలింది. దీంతో ఆయన్న సస్పెండ్ చేసినట్టు టీటీడీ మంగళవారం ప్రకటించింది. ‘రాజశేఖరబాబు టీటీడీ ఉద్యోగిగా సంస్థ ప్రవర్తనా నియమావళిని పాటించలేదు. హిందూ ధార్మిక సంస్థకు ప్రాతినిధ్యం వహించే ఉద్యోగి అయివుండి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు. టీటీడీ విజిలెన్స్ నివేదిక, ఇతర ఆధారాలను పరిశీలించి, ఆయనపై శాఖాపరమైన చర్యలతో పాటు ఆయన్ను సస్పెండ్ చేస్తున్నాం’ అని టీటీడీ పేర్కొంది.
Updated Date - Jul 09 , 2025 | 04:57 AM