Ration Shops: 4 రోజుల్లోనే 57% రేషన్ పంపిణీ
ABN, Publish Date - Jun 05 , 2025 | 05:48 AM
గత వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎండీయూ వాహనాలను రద్దు చేసిన కూటమి ప్రభుత్వం.. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 29,796 రేషన్ షాపులను పునఃప్రారంభించిన సంగతి తెలిసిందే.
ఇప్పటికి 84 లక్షల కుటుంబాలకు అందిన సరుకులు
చౌక దుకాణాల ద్వారా పంపిణీ వేగవంతం
వీలున్నప్పుడు వెళ్లి తెచ్చుకుంటున్న లబ్ధిదారులు
రేషన్ షాపుల పునఃప్రారంభంతో కలిగిన సౌలభ్యం
వృద్ధులు, దివ్యాంగులకు ఇళ్ల వద్దకే సరుకులు చేరవేత
అమరావతి, జూన్ 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రేషన్ షాపుల ద్వారా సరుకుల పంపిణీ వేగం పుంజుకుంది. గత నెల వరకు ఎండీయూ వాహనాల ద్వారా చేసిన పంపిణీ కంటే ఈ నెల ఒకటో తేదీ నుంచి పునఃప్రారంభించిన రేషన్ షాపుల ద్వారానే సరుకుల పంపిణీ మెరుగ్గా ఉంది. గత వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎండీయూ వాహనాలను రద్దు చేసిన కూటమి ప్రభుత్వం.. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 29,796 రేషన్ షాపులను పునఃప్రారంభించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో మొత్తం 1,46,21,233 రేషన్ కార్డులు ఉండగా.. బుధవారం వరకు సుమారు 85 లక్షల కుటుంబాలు రేషన్ సరుకులు తీసుకున్నాయి. అంటే, 4 రోజుల్లోనే 57 శాతానికి పైగా సరుకుల పంపిణీ పూర్తైంది. గతంలో రాష్ట్రవ్యాప్తంగా 9,260 ఎండీయూ వాహనాల ద్వారా రోజుకు సగటున 12 లక్షల కుటుంబాలకు మాత్రమే సరుకులు పంపిణీ చేయగలిగేవారు. ఎండీయూ వాహనాలు తమ వీధికి వచ్చే సమయానికి ఇళ్ల దగ్గర లేని కార్డుదారులు ఆ నెల రేషన్ సరుకులు కోల్పోవాల్సి వచ్చేది. ఇప్పుడు రేషన్ షాపుల్లో రోజూ ఉదయం 8 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు సరుకులు పంపిణీ చేస్తుండటంతో కార్డుదారులే వీలు కుదిరినప్పుడు వెళ్లి సరుకులు తెచ్చుకుంటున్నారు. ఈ నాలుగు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 26,29,864 కుటుంబాలవారు పోర్టబులిటీ ద్వారా రేషన్ సరుకులు తీసుకున్నారు. రేషన్ షాపులకు వెళ్లలేని దివ్యాంగులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఇళ్లకే సరుకులను తీసుకువెళ్లి అందిస్తున్నారు. రేషన్ షాపుల పునఃప్రారంభం వల్ల తమకు వీలు కుదిరినప్పుడు వెళ్లి సరుకులు తెచ్చుకోవడానికి ఎంతో సౌలభ్యంగా ఉందంటూ కార్డుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
For AndhraPradesh News And Telugu News
Updated Date - Jun 05 , 2025 | 05:48 AM