Raj Kasireddy Liquor Scam: రాజ్ కసిరెడ్డికి ఈడీ ఉచ్చు
ABN, Publish Date - May 16 , 2025 | 04:47 AM
మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డిపై ఈడీ ఉచ్చు బిగుస్తోంది. వాంగ్మూలం నమోదుకు అనుమతివ్వాలని ఈడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
వాంగ్మూలం నమోదుకు అనుమతివ్వండి .. కోర్టులో పిటిషన్ దాఖలు
విజయవాడ, మే 15(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డికి ఈడీ ఉచ్చు బిగిస్తోంది. రాష్ట్రంలో జరిగిన మద్యం కుంభకోణానికి సంబంధించిన వివరాలు అందజేయాలని సిట్ అధికారులకు ఇటీవల ఈడీ లేఖ రాసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న రాజ్ వాంగ్మూలం నమోదు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఈడీ తరఫు న్యాయవాది జయప్రకాశ్ ఏసీబీ కోర్టులో గురువారం పిటిషన్ దాఖలు చేశారు. జైల్లో ఉన్న నిందితుల నుంచి వాంగ్మూలం తీసుకునే ప్రక్రియకు సంబంధించిన ఈడీ నిబంధనల గురించి న్యాయాధికారి పి.భాస్కరరావు ప్రశ్నించారు. ఆ కాపీని ఇవ్వాలని అడిగారు. ఈ కాపీ అందుబాటులో లేదని, త్వరలో సమర్పిస్తానని జయప్రకాశ్ తెలిపారు. ఈ కేసులో రూ.3,250 కోట్ల కుంభకోణం జరిగినట్టుగా సిట్ అధికారులు నిర్ధారించారు. ఇప్పుడు ఈడీ రంగ ప్రవేశంతో కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయని భావిస్తున్నారు.
Updated Date - May 16 , 2025 | 04:48 AM