Wall Construction : డయాఫ్రం వాల్ పనులు వాయిదా
ABN, Publish Date - Jan 01 , 2025 | 04:16 AM
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన డయాఫ్రం వాల్ నిర్మాణానికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. పనుల ప్రారంభానికి కేంద్ర జలసంఘం ఇంకా పచ్చజెండా ఊపలేదు.
ప్లాస్టిక్ కాంక్రీట్ మిక్చర్ను నిపుణులు ఆమోదించాకే అనుమతి
కేంద్ర జలసంఘం స్పష్టీకరణ.. 4 నమూనాలు పంపిన జలవనరుల శాఖ
క్రిస్మస్ సెలవుల్లో ఉన్న నిపుణులు.. ఎన్ని సార్లు సంప్రదించినా స్పందన లేదు
7-10 తేదీల మధ్య వారితో వీడియో కాన్ఫరెన్సు
ఇక జనవరి మూడో వారంలోనే పనులు మొదలయ్యే పరిస్థితి
అమరావతి, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన డయాఫ్రం వాల్ నిర్మాణానికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. పనుల ప్రారంభానికి కేంద్ర జలసంఘం ఇంకా పచ్చజెండా ఊపలేదు. విదేశీ నిపుణుల నుంచి ఆమోదం రాకపోవడమే దీనికి కారణం. దీంతో గురువారం నుంచి మొదలవ్వాల్సిన పనులు వాయిదాపడ్డాయి. వాల్ నిర్మాణం కోసం జర్మన్ కాంట్రాక్టు సంస్థ బావర్ అవసరమైన యంత్ర సామగ్రిని, అనుభవజ్ఞులైన ఇంజనీరింగ్ సిబ్బందిని సిద్ధం చేసుకుంది. నిర్మాణ పనులను జనవరి 2 నుంచి ప్రారంభించి నవంబరు నాటికి పూర్తిచేయాలని ముందస్తుగా నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి తాను హాజరవుతానని సీఎం చంద్రబాబు సైతం చెప్పారు. కానీ ఇప్పటిదాకా కేంద్ర జల సంఘం నుంచి గ్రీన్ సిగ్నల్ అందలేదు. వాల్ నిర్మాణంలో కీలకభూమిక వహించే ప్లాస్టిక్ కాంక్రీట్ మిక్చర్పై విదేశీ నిపుణులు.. డేవిడ్ బ్రియాన్ పాల్, జియాన్ ఫ్రాంకో డి సిక్కో (అమెరికా), సీన్ హించ్బెర్గర్, చార్లెస్ రిచర్డ్ డొనెల్లీ(కెనడా)తో కూడిన బృందం ఆమోదం పొందాల్సిందేనని జల సంఘం స్పష్టం చేసింది. జల వనరుల శాఖ ఇప్పటికే నాలుగు ప్లాస్టిక్ కాంక్రీట్ మిక్చర్ల నమూనాలను సిద్ధం చేసి నిపుణులకు పంపింది. వాటిని పరిశీలించాల్సిన వారు ప్రస్తుతం క్రిస్మస్ వేడుకల్లో ఉన్నారు. జల సంఘం, పీపీఏ, జల వనరుల శాఖ ఎంత ప్రయత్నించినా వారి నుంచి సమాధానం రాలేదు.
దీంతో.. గురువారం నుంచి ప్రారంభం కావలసిన డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు వాయిదా పడ్డాయి. నిపుణులు అందుబాటులోకి వస్తే.. జనవరి 7-10 తేదీల మధ్య వీడియో కాన్ఫరెన్సులో వారితో సంప్రదింపులు జరిపి.. కాంక్రీట్ మిక్చర్పై నిర్ణయానికి వస్తామని జల వనరులశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో వాల్ నిర్మాణ పనులు ఈ నెల మూడో వారం నుంచి ప్రారంభమయ్యే వీలుందని అధికారులు చెబుతున్నారు.
నిపుణులకూ అనుభవం లేదు!
డయాఫ్రం వాల్ ప్లాస్టిక్ కాంక్రీట్ మిక్చర్పై విదేశీ నిపుణుల ఆమోదం పొందాలని కేంద్ర జల సంఘం చెబుతోంది. అయితే ఈ మిక్చర్ విషయంలో వారికి కూడా అనుభవం లేదని కేంద్ర జలశక్తి శాఖ వర్గాలు అంటున్నాయి. ఈ విషయంలో కాంట్రాక్టు సంస్థ బావర్కు మాత్రమే విశేషానుభవం ఉందని ఇంజనీరింగ్ వర్గాలు చెబుతున్నాయి. అయినప్పుటికీ విదేశీ నిపుణుల ఆమోదం పొందాకే పనులు ప్రారంభించాలని జల సంఘం ఆదేశించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
Updated Date - Jan 01 , 2025 | 04:16 AM