AP High Court : కర్నూలులో హైకోర్టు బెంచ్ నిర్ణయంపై పిల్
ABN, Publish Date - Feb 05 , 2025 | 04:30 AM
బెంచ్ ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది.
రాజకీయ కారణాలతో బెంచ్ ఏర్పాటు చట్టవిరుద్ధం
రాజధాని కేసులో విస్తృత ధర్మాసనం తీర్పునకు విరుద్ధం
బెంచ్ల ఏర్పాటుపై కమిషన్ సూచనలు పరిగణనలోకి తీసుకోలేదు
న్యాయశాఖ కార్యదర్శి లేఖపై చర్యలన్నీ నిలిపేయండి
హైకోర్టును అభ్యర్థించిన పిటిషనర్లు
అమరావతి, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. హైకోర్టు న్యాయవాదులు తాండవ యోగేష్, తురగా సాయి సూర్య ఈ పిల్ దాఖలు చేశారు. హైకోర్టు బెంచ్లు ఏర్పాటు విషయంలో జస్టిస్ జస్వంత్ సింగ్ కమిషన్ 1985లో ఇచ్చిన నివేదిక, వర్చువల్ హియరింగ్, ఆన్లైన్ ఫైలింగ్ వంటి సౌకర్యాలను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం స్థానిక ప్రజల భావోద్వేగాలు, రాజకీయ కారణాలతో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి నిర్ణయించడం చట్టవిరుద్ధమని పిటిషన్లో పేర్కొన్నారు. రాజధాని అమరావతి కేసులో హైకోర్టు విస్తృత ధర్మాసనం ఇచ్చిన తీర్పునకు కూడా ఈ నిర్ణయం విరుద్ధమన్నారు. బెంచ్ ఏర్పాటుకి సంబంధించిన రికార్డులను రద్దు చేయాలని, అమరావతిలో ఉన్న ప్రిన్సిపల్ బెంచ్ను రాష్ట్రానికి ఏకైక హైకోర్టుగా ప్రకటించాలని కోరారు. బెంచ్ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసేందుకు హైకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ ఈ నెల 6న కర్నూలులో పర్యటించబోతోందన్నారు. ఈ నేపథ్యంలో న్యాయశాఖ కార్యదర్శి గతేడాది అక్టోబరు 28న రిజిస్ట్రార్ జనరల్కు రాసిన లేఖ ఆధారంగా తీసుకునే తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ను వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చారు. ‘హైకోర్టును విభజించి, బెంచ్ ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం బెంచ్ ఏర్పాటు ప్రతిపాదన హైకోర్టు సీజే నుంచి రావాలి తప్ప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కాదు. తిరుపతి, శ్రీకాళహస్తి, చిత్తూరు వంటి ప్రాంతాల నుంచి విజయవాడకు మంచి రవాణా సౌకర్యం ఉంది. కర్నూలులో బెంచ్ ఏర్పాటుకు అంగీకరిస్తే విశాఖలో కూడా బెంచ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ వస్తుంది. కర్నూలు రాయలసీమ ప్రాంతానికి మధ్యలో లేదు. తెలంగాణ సరిహద్దుకు కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు నిర్ణయాన్ని రద్దు చేయండి’ అని పిటిషన్లో కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సమావేశం
శ్రీకాకుళం పట్టణానికి కొత్త శోభ: రామ్మోహన్ నాయుడు
తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Feb 05 , 2025 | 04:30 AM