Minister Atchan Naidu : నువ్వు ఇచ్చిన ధర రూ.7 వేలేగా జగన్!
ABN, Publish Date - Feb 20 , 2025 | 05:22 AM
151 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి అధికారం అప్పగిస్తే ఐదేళ్లూ ప్యాలెస్కే పరిమితమైన జగన్ ఇప్పుడు బయటకొచ్చి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు
జనం నవ్వుకుంటున్నారని కూడా లేకుండా అబద్ధాలు
వైసీపీ అధినేత మానసిక స్థితిపై అనుమానమొస్తోంది: అచ్చెన్న
అమరావతి, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): జనం నవ్వుకుంటారని కూడా లేకుండా వైసీపీ అధినేత జగన్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. 151 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి అధికారం అప్పగిస్తే ఐదేళ్లూ ప్యాలెస్కే పరిమితమైన జగన్ ఇప్పుడు బయటకొచ్చి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. జగన్ మాటలు వింటుంటే ఆయన మానసిక స్థితి సరిగా లేదన్న అనుమానం వస్తుందని అచ్చెన్న వ్యాఖ్యానించారు. బుధవారం అమరావతి సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. ‘అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా నిరంతరం ప్రజల పక్షాన పని చేసే వాడే నిజమైన నాయకుడు. కానీ జగన్లాంటి నాయకుడు రాజకీయాలకు పనికి రాడని ఐదు కోట్ల ప్రజలు మొన్న ఎన్నికల్లో చిత్తుగా ఓడించారు. మిర్చి క్వింటాకు రూ.20 వేలు గిట్టుబాటు ధర ఉండాలని డిమాండ్ చేస్తున్న జగన్. తను సీఎంగా ఉన్నప్పుడు రూ.20 వేలు ఎంఎ్సపీ ఎందుకు ప్రకటించలేదు. 2022-24లో క్వింటా ధర రూ.20,500 ఉంది. అంతకు ముందు 2020-21లో క్వింటా రూ.12 వేలు పలుకుతున్నప్పుడు జగన్ ప్రభుత్వం రూ.7 వేలు మద్దతు ధర ప్రకటించిన విషయం వాస్తవం కాదా? మార్కెట్ ధర కంటే తక్కువ ఎంఎ్సపీని ప్రకటించిన జగన్ ఇప్పుడు రూ.20 వేలకు కొనాలంటూ గగ్గొలు పెడితే ప్రజలు విశ్వసించరు’ అని అచ్చెన్నాయుడు అన్నారు. ప్రస్తుతం రూ.13,600 ధర వస్తుందని ఈ పరిస్థితుల్లో ఎంఎ్సపీ ప్రకటిస్తే రైతులు నష్టపోతారని అందుకని మిర్చి రైతులకు సాయం చేయాలని కేంద్రప్రభుత్వాన్ని కోరామని వివరించారు. దీనిపై కేంద్రం కూడా సానుకూలంగా స్పందించిందన్నారు. రైతులకు ఇంకా మేలు చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాలుగుసార్లు కేంద్రానికి లేఖలు రాశారు. నష్టపోయిన మిర్చి రైతులకు బోనస్ ఇప్పించేలా ప్రయత్నిస్తున్నాం. రైతుల కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంటే.. సంతోషించాల్సింది పోయి.. పని లేక గుంటూరు యార్డుకెళ్లి.. అబద్దాలు మాట్లాడటం జగన్కే చెల్లిందని వ్యాఖ్యానించారు.
నాడు మిర్చి రైతుకు 138 కోట్ల బోనస్ ఇచ్చాం
ప్రస్తుతం గుంటూరు యార్డుకు రోజూ లక్షన్నర టిక్కీల మిర్చి వస్తోందని మంత్రి తెలిపారు. కోల్డ్స్టోరేజీల్లో నిల్వలన్నీ అయిపోయాయని, ఇప్పుడు వచ్చిన సరుకు వచ్చినట్లు శ్రీలంక, చైనా, మలేషియాకు ఎగుమతి అవుతుందని అన్నారు. దేశ చరిత్రలో తొలిసారి 2017లో మిర్చి రైతులను ఆదుకునేందుకు నాటి టీడీపీ ప్రభుత్వం రూ.138కోట్లు బోనస్ ఇచ్చిందని, ఐదేళ్లలో మిర్చి రైతులకు నయాపైనా సాయం చేయని జగన్.. తన పాలనలో వ్యవసాయ అనుబంధ రంగాలకు తాళం వేశారని మంత్రి విమర్శించారు. ‘ఐదేళ్లలో ఒక్కటైనా భూసార పరీక్షలు చేసినట్లు నిరూపిస్తారా? వ్యవసాయ యాంత్రీకరణకు పైసా ఖర్చు చేయలేదు. కనీసం రాయలసీమ రైతులకు ఒక్క డ్రిప్, స్పింక్లరు ఇచ్చారా? ధాన్యం కొని, నెలల తరబడి సొమ్ము చెల్లించలేదు. జగన్ దిగిపోయేనాటికి రూ.1,600 కోట్లు బకాయి పెడితే మా కూటమి ప్రభుత్వం చెల్లించింది. మేం ధాన్యం కొన్న 2గంటల్లో రైతు ఖాతాకు డబ్బు జమ చేశాం. కందుల ధర తగ్గితే నాఫెడ్తో కొనిపించాం. టమాటా ధర తగ్గితే మార్కెట్ జోక్యంతో కొని, సబ్సిడీ రేటుకు రైతు బజార్లలో విక్రయించాం. ఎరువుల కొరత లేకుండా బఫర్ స్టాక్స్ పెట్టాం. 8 నెలల్లో 5 తుఫాన్లు వస్తే.. రైతులకు ఇన్పుట్స్ సబ్సిడీ ఇచ్చాం’ అని వివరించారు. ధరలు తగ్గినప్పుడు రైతుల్ని ఆదుకునేందుకు వచ్చే బడ్జెట్లో మార్కెట్ జోక్యం పథకానికి నిధులు కేటాయించనున్నామని తెలిపారు. ఎన్నికల కోడ్ ఉండగా మిర్చి యార్డుకు జగన్ వెళ్లడంపై ఎన్నికల కమిషన్ చూసుకుంటుందని, నాటి వైసీపీ ప్రభుత్వంలా కూటమి ప్రభుత్వం ఎవర్నీ నిర్బంధించబోదని, ప్రతిపక్షాలకు అడ్డు పెట్టాలనే ఉద్ధేశం తమ ప్రభుత్వానికి లేదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.
నాడు పట్టించుకోకుండా : జంగా
తన ఐదేళ్ల పాలనలో రైతులకు ఉపయోగపడే పని ఒక్కటీ చేయని జగన్, ఇప్పుడు పరామర్శ యాత్రలు చేస్తున్నారని టీటీడీ పాలకమండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి ధ్వజమెత్తారు. తన పాలనలో జగన్... ధరల స్థిరీకరణ నిధిని కూడా దుర్వినియోగం చేశారని జంగా బుధవారం అమరావతిలో ఆరోపించారు. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి మరీ గుంటూరు మిర్చి యార్డులో పర్యటించాల్సిన అవసరం ఏమొచ్చిందని జగన్ను నిలదీశారు.
Updated Date - Feb 20 , 2025 | 05:22 AM