మహానందిలో భక్తుల రద్దీ
ABN, Publish Date - Jun 02 , 2025 | 11:40 PM
వేసవి సెలవులను పురష్కరించుకొని వేలాదిమంది భక్తులు కుటుంబ సమేతంగా మహానంది క్షేత్రానికి దైవదర్శనం కోసం తరలి వచ్చారు.
మహానంది, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): వేసవి సెలవులను పురష్కరించుకొని వేలాదిమంది భక్తులు కుటుంబ సమేతంగా మహానంది క్షేత్రానికి దైవదర్శనం కోసం తరలి వచ్చారు. పరమశివుడికి ప్రీతివంతమైన సోమవారం ప్రధాన ఆలయంలో అభిషేకాలను జరుపుకొన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాక కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల నుంచి ఆదివారం రాత్రే వివిధ వాహనాల ద్వారా భక్తులు తరలివచ్చారు. దీంతో దేవస్థానానికి చెందిన వసతి గృహాలు నిండిపోవడంతో సమీపంలోని ప్రైవేట్ లాడ్జీలకు డిమాండ్ పెరిగింది. తెల్లవారుజాముననే ఆలయ ప్రాంగణంలోని రుద్రగుండం కోనేరుతో పాటు రెండో ప్రాకారంలోని పూల కోనేర్లల్లో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి, మహానందీశ్వరుడు, కామేశ్వరీదేవి అమ్మవార్లను దర్శించు కున్నారు. రాత్రి వరకు మహానంది పరిసరాల్లో భక్తుల సందడి నెలకొంది.
Updated Date - Jun 02 , 2025 | 11:40 PM