Higher Education: ఉపాధి అవకాశాలు పెంచేలా పాఠ్య ప్రణాళిక
ABN, Publish Date - Jun 05 , 2025 | 05:35 AM
మంగళగిరిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో బుధవారం జరిగిన వీసీల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
వీసీల సమావేశంలో ఉన్నత విద్యాశాఖ అధికారులు
అమరావతి, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): సమాజంలోని అవసరాలకు తగ్గట్టుగా, ఉపాధి అవకాశాలను పెంచేలా పాఠ్యప్రణాళిక (కరిక్యులమ్)ను రూపొందించాలని ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ యూనివర్సిటీల ఉప కులపతుల (వీసీ)కు సూచించారు. మంగళగిరిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో బుధవారం జరిగిన వీసీల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. యూనివర్సిటీ కాలేజీలతో పాటు ఐటీఐలు, పాలిటెక్నిక్లు, సాంకేతిక కాలేజీలు, డిగ్రీ కాలేజీలకు కూడా కరిక్యులమ్ విషయంలో మార్గనిర్దేశం చేయాలన్నారు. తమ పరిధిలోని విద్యాసంస్థల సమగ్ర సమాచారం ఆయా యూనివర్సిటీల వద్ద ఉండాలన్నారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ కె.మధుమూర్తి మాట్లాడుతూ... వర్సిటీల్లో బోధన సిబ్బంది నియామకానికి ఉన్న అవరోధాలను సమీక్షించామన్నారు. నాణ్యమైన విద్య అందించేందుకు న్యాయ, ఇతర శాఖలతో సమన్వయం చేసుకుని బోధనా సిబ్బంది భర్తీలో ఉన్న కోర్టు కేసులను పరిష్కరించే ప్రయత్నం చేస్తామన్నారు. కొత్తగా డ్యూయల్ మేజర్ డిగ్రీ ప్రవేశపెట్టామన్నారు. సాంకేతిక కోర్సుల విషయంలో అన్ని యూనివర్సిటీలు ఒకే కరిక్యులమ్ ఫ్రేమ్వర్క్ను పాటించాలన్నారు. యూనివర్సిటీల్లో రీసెర్చ్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
For AndhraPradesh News And Telugu News
Updated Date - Jun 05 , 2025 | 05:35 AM