Kidnap Case: వల్లభనేని వంశీకి బెయిల్
ABN, Publish Date - May 14 , 2025 | 05:41 AM
ముదునూరి సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో పాటు ఐదుగురికి ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఇంకా బెయిల్ రాకపోవడంతో వంశీ జైలులోనే కొనసాగనున్నారు.
సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో ఐదుగురికి బెయిలిచ్చిన ఏసీబీ కోర్టు
టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ ఇంకా రిమాండ్లోనే..
విజయవాడ, మే 13(ఆంధ్రజ్యోతి): గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్కు ఊరట లభించింది. ముదునూరి సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో మొత్తం ఆరుగురు నిందితుల్లో ఐదుగురికి బెయిల్ మంజూరు చేస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీతో పాటు ఓలుపల్లి మోహన రంగారావు అలియాస్ రంగా, నిమ్మ లక్ష్మీపతి, గంటా వీర్రాజు, వేలూరి వంశీ బాబు, వెలినేని శివరామకృష్ణ ప్రసాద్ను మంగళవారం కోర్టుకు తీసుకొచ్చారు. వారి రిమాండ్ను బుధవారం వరకు పొడిగిస్తూ న్యాయాధికారి పి.భాస్కరరావు ఉత్తర్వులు ఇచ్చారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడుకునేందుకు గంట సమయం ఇస్తూ మౌఖికాదేశాలు జారీ చేశారు. సాయంత్రం వంశీ, మోహన రంగారావు, లక్ష్మీపతి, వీర్రాజు, వంశీబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చారు. ఒక్కొక్కరు రూ.50 వేలతో రెండు ష్యూరిటీలను మూడు రోజుల్లోగా సమర్పించాలని స్పష్టం చేశారు. ప్రతి శనివారం పోలీసు స్టేషన్కు వెళ్లి సంతకం చేయాలని తీర్పులో పేర్కొన్నారు. ఇదే కేసులో శివరామకృష్ణ ప్రసాద్(ఏ7) బెయిల్ కోసం హైకోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. కాగా, గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఇంకా బెయిల్ రాకపోవడంతో వంశీ జైలులోనే ఉండనున్నారు.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు: వంశీ
జైలులో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నానని న్యాయాధికారికి వంశీ వివరించారు. ఆక్సిజన్ ఎనలైజర్ పెట్టుకోవడం వల్ల ముక్కు వద్ద ఉన్న ఎముకలు నొప్పి వస్తున్నాయని చెప్పారు. రాత్రి నిద్రపోయే సమయంలో పల్స్ రేటు ఒక్కసారిగా తగ్గిపోతోందని తెలిపారు. వైద్యులు రాసిన మందులు కాకుండా జైలు అధికారులు వేరే మందులు ఇస్తున్నారని వంశీ తరఫు న్యాయవాది సత్యశ్రీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వంశీకి ప్రభుత్వాస్పత్రిలో గానీ, ప్రభుత్వ గుర్తింపు పొందిన ఆస్పత్రిలో గానీ వైద్యం చేయించాలని ఆదేశిస్తూ న్యాయాధికారి ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు
కోర్టు ఆదేశాలతో జైలు అధికారులు వంశీని సాయంత్రం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మొదటి అంతస్తులో ఉన్న రెసిడెంటల్ మెడికల్ ఆఫీసర్ చాంబర్లో వైద్యులు వంశీ రక్త నమూనాలను సేకరించారు. బీపీ, షుగర్, ఈసీజీ, సీటీ స్కాన్ పరీక్షలు చేశారు. ఆయనకు దగ్గు వస్తున్నట్లు గుర్తించారు.
రంగాకు రిమాండ్ పొడిగింపు
వంశీ ప్రధాన అనుచరుడు ఓలుపల్లి మోహన రంగారావు అలియాస్ రంగాకు ఈ నెల 27 వరకు రిమాండ్ను పొడిగిస్తూ కోర్టు ఆవేశాలు ఇచ్చింది. గన్నవరం పోలీ్సస్టేషన్లో నమోదైన భూకబ్జా కేసులో ఆయనను పోలీసులు మంగళవారం విజయవాడలోని మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరు పరిచారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Sravan Rao: చీటింగ్ కేసులో శ్రవణ్ రావు అరెస్ట్
CM Chandrababu: ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్తో సీఎం చంద్రబాబు భేటీ
Suryapet DSP Parthasarathy: డీఎస్పీ ఇంట్లో అక్రమంగా 100 బుల్లెట్లు..
Updated Date - May 14 , 2025 | 05:41 AM