Electric Shock: విద్యుద్దీపాల అలంకరణ వైర్లే.... మృత్యుపాశాలయ్యాయి
ABN, Publish Date - May 27 , 2025 | 06:00 AM
శ్రీకాకుళం జిల్లా సామంతపుట్టుగ గ్రామంలో విద్యుదాఘాతంతో ముగ్గురు మృతి చెందారు, ముగ్గురు గాయపడ్డారు. పంచాయతీ పరిధిలో జరిగే గ్రామ వేడుకల సందర్భంగా జరిగిన ప్రమాదంపై ప్రభుత్వం స్పందిస్తూ బాధిత కుటుంబాలకు సహాయం ప్రకటించింది.
విద్యుదాఘాతంతో ముగ్గురి మృతి
మరో ముగ్గురికి గాయాలు
గ్రామదేవత ఉత్సవాలు ముగిసిన వెంటనే విషాదం
కంచిలి, మే 26(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం తలతంపర పంచాయతీ పరిధిలోని సామంతపుట్టుగ (చిల్లొపుట్టుగ)లో విద్యుదాఘాతంతో సోమవారం ఉదయం ముగ్గురు మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ నెల 17వ తేదీ నుంచి తొమ్మిది రోజులపాటు గ్రామ దేవత సింధుపట్రాణి సంబరాలు తలతంపర పంచాయతీతో పాటు పరిసర గ్రామాల్లో కూడా జరిగాయి. సామంతపుట్టుగ గ్రామ వీధుల్లో విద్యుద్దీపాలతో అలంకరించారు. వీటికి సమీప ఇళ్ల నుంచి విద్యుత్ కనెక్షన్ తీసుకున్నారు. ఆదివారం రాత్రితో సంబరాలు ముగిశాయి. సోమవారం ఉదయం గ్రామంలో ఏర్పాటు చేసిన విద్యుద్దీపాల అలంకరణను తొలగించారు. అయితే బల్బుల కోసం ఏర్పాటు చేసిన ఇనుప వైర్లు ఇంకా తొలగించాల్సి ఉంది. చిల్లొ ఈశ్వరరావు అనే వ్యక్తి ఇంటిలోపల నుంచి బయట అలంకరణల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్లకు సంబంధించిన స్విచ్ను అనుకోకుండా వేయడంతో ఇనుప తీగకు విద్యుత్ సరఫరా జరిగింది. ఈసందర్భంలో అక్కడ ఆడుకుంటున్న నొళియా కృష్ణ , బహడపల్లి నందిని, పొడియా మనోజ్ అనే రెండేళ్ల బాలుడికి విద్యుత్ షాక్ తగిలింది. ఇది గమనించిన ఈశ్వరరావు వెంటనే తన మేనల్లుడైన కృష్ణను రక్షించే క్రమం లో వైర్లను తప్పించేందుకు వాటిని పట్టుకున్నాడు. దీంతో షాక్ తగిలి ఈశ్వరరావు (28), బహడపల్లి నందిని (12), నొళియా కృష్ణ (3) అక్కడికక్కడే చనిపోయారు. బాలుడు మనోజ్ పరిస్థితి విషమంగా ఉండటంలో సోంపేట ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అనంతరం బరంపురం తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు ఈశ్వరరావు అక్క కుమారి వచ్చి వైర్లను తప్పించేందుకు ప్రయత్నించింది. ఆమెకు కూడా షాక్ తగిలి చేతికి గాయాలయ్యాయి. చిన్నారులను కాపాడేందుకు ప్రయత్నించిన చిల్లొ తరిణి అనే వ్యక్తికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకుని మంత్రి అచ్చెన్నాయుడు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
PM Modi: నా బుల్లెట్ రెడీ.. పాక్కు మోదీ వార్నింగ్
మోదీ రోడ్షోలో కల్నల్ సోఫియా ఖురేషి కుటుంబసభ్యులు
జ్యోతి మల్హోత్రాకు ఆరుగురు పాక్ గన్మెన్ల సెక్యూరిటీ.. సాటి యూట్యూబర్కు షాక్
ఆపరేషన్ సిందూర్పై ముందుగానే పాక్కు లీక్.. పెదవి విప్పిన జైశంకర్
For National News And Telugu News
Updated Date - May 27 , 2025 | 06:00 AM