SV Veterinary University: దళితుడినని కుర్చీ తీసేశారు
ABN, Publish Date - Jun 22 , 2025 | 04:19 AM
దళితుడినని తన గదిలో కుర్చీని తీసేశారని తిరుపతి ఎస్వీ వెటర్నరీ వర్సిటీ పరిధిలోని డెయిరీ టెక్నాలజీ విభాగం కాంట్రాక్టు అధ్యాపకుడు వి.రవివర్మ ఆరోపించారు.
ఎస్వీ వెటర్నరీ వర్సిటీ డెయిరీ విభాగంలో వివాదం
నేలపై కూర్చొని అధ్యాపకుడి నిరసన
అసోసియేట్ డీన్ రవీంద్రారెడ్డిపై ఆరోపణ
వీసీ జోక్యంతో సద్దుమణిగిన వివాదం
తిరుపతి రూరల్, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): దళితుడినని తన గదిలో కుర్చీని తీసేశారని తిరుపతి ఎస్వీ వెటర్నరీ వర్సిటీ పరిధిలోని డెయిరీ టెక్నాలజీ విభాగం కాంట్రాక్టు అధ్యాపకుడు వి.రవివర్మ ఆరోపించారు. శనివారం విధులకు హాజరైన ఆయన నేలపై కూర్చుని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. గురువారం సెలవులో ఉన్నానని, శుక్రవారం కాలేజీకి హాజరై.. తన గదిలోకి వెళ్లగా కుర్చీ కనిపించలేదని, టేబుల్ మాత్రమే ఉందని రవివర్మ పేర్కొన్నారు. దీనిపై సిబ్బందిని ఆరా తీయగా.. తన రూమ్లో ఉన్న పరికరంలో పాలను పరీక్షించేందుకు వచ్చిన అసోసియేట్ డీన్ రవీంద్రారెడ్డి కుర్చీని తొలగించినట్టు తెలిసిందన్నారు. దీనిపై విభాగాధిపతి విజయగీతను అడగ్గా.. ఆమె తెలియని చెప్పారని, దీంతో డెయిరీ టెక్నాలజీ డీన్ నాగేశ్వరరావుకి ఫోన్లో వివరించానని తెలిపారు.
సమాచారం తెలుసుకున్న వీసీ రమణ శనివారం ఉదయం డెయిరీ టెక్నాలజీ విభాగానికి వచ్చి రవివర్మతో మాట్లాడారు. డీన్తో ఫోన్లో మాట్లాడి, కుర్చీ ఏర్పాటు చేయాలని సూచించానని, మరోసారి ఇలా జరగకుండా చూస్తామని సర్దిచెప్పారు. ఈ క్రమంలోనే డీన్, అసోసియేట్ డీన్, విభాగాధిపతిలకు ఫోన్ చేశారు. దీంతో డీన్, హెడ్లు విభాగానికి చేరుకోగా.. అసోసియేట్ డీన్ మాత్రం గంట తర్వాత వచ్చారు. ఏడీ వచ్చిన తర్వాత అందరితో మాట్లాడి వివాదాన్ని సద్దుమణిగేలా చూశారు. దీనిపై డీన్ నాగేశ్వరరావును ‘ఆంరఽధజ్యోతి’ వివరణ కోరగా.. డీబీఎం విభాగానికి అవసరమని రెండు కుర్చీలు కొనుగోలు చేశామని, దానిలో ఒకటి డెయిరీ టెక్నాలజీ విభాగంలో ఉండడం గమనించి మార్చినట్టు తనకు ఏడీ చెప్పారన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, వర్సిటీలో చాలా కాలంగా వర్గపోరు నడుస్తుండడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్న ప్రచారం జరుగుతోంది.
Updated Date - Jun 22 , 2025 | 04:19 AM