CM Chandrababu: ప్రజలతో మమేకమవ్వండి
ABN, Publish Date - May 31 , 2025 | 05:43 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలతో మరింత సన్నిహితంగా ఉంటూ ప్రభుత్వ పథకాలపై నిరంతరం చర్చలు జరగాలని సూచించారు. కడప మహానాడు విజయవంతం చేసిన నాయకత్వాన్ని ఆయన అభినందిస్తూ, ‘నా తెలుగు కుటుంబం’ శాసనాలను ప్రజల్లో విస్తరించాల్సిన బాధ్యతపై గొప్ప దృష్టిపెట్టారు.
ప్రభుత్వ కార్యక్రమాలపై నిరంతర చర్చ
త్వరలో సంక్షేమ క్యాలెండర్ ప్రకటన: సీఎం
అమరావతి, మే 30 (ఆంధ్రజ్యోతి): ‘ప్రజలతో నాయకులు మరింత మమేకం కావాలని.. తద్వారా ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలపై నిరంతరం చర్చ జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తాను ప్రతి నెలా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడానికి కారణం కూడా అదేనని.. ఎమ్మెల్యేలు కూడా విధిగా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. మహానాడులో ప్రవేశపెట్టిన ‘నా తెలుగు కుటుంబం’లోని ఆరు శాసనాలను విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు, గ్రామ స్థాయి నాయకులతో చంద్రబాబు శుక్రవారం ఉదయం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కడప మహానాడును విజయవంతం చేసిన కడప జిల్లా నాయకత్వానికి, రాష్ట్ర స్థాయి నేతలకు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. నాయకత్వం సమష్టిగా పనిచేస్తే ఏ కార్యక్రమమైనా సజావుగా జరుగుతుందని కడప మహానాడుతో నిరూపితమైందన్నారు. మంత్రులంతా కార్యకర్తల్లా పనిచేసి స్ఫూర్తినిచ్చారని అభినందించారు.
కూటమి ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసేలా పాలన సాగుతోందని, ఏడాదిలో మనం చేపట్టిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పాలనా నిర్ణయాలపై వారిలో సానుకూలత ఉందని తెలిపారు. ‘ప్రజలకు ఏడాది పాలనలో ఏం చేశామో.. రాబోయే రోజుల్లో ఏం చేస్తామో మహానాడు ద్వారా వివరించాం. జూన్లో తల్లికి వందనం, అన్నదాతా సుఖీభవ ప్రారంభిస్తాం. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించబోతున్నాం. సంక్షేమ క్యాలెండర్ను త్వరలో ప్రకటిస్తాం’ అని సీఎం తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఢిల్లీలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకున్న నేపథ్యంలో ఆయన శుక్రవారం సీఎంను ఆయన అధికారిక నివాసం వన్ జనపథ్లో కలిశారు. ఈ సందర్భంగా మంద కృష్ణను, చంద్రబాబు అభినందించారు. వర్గీకరణ ఉద్యమ ప్రస్థానాన్ని గురించి ఇరువురు నేతలు గుర్తు చేసుకున్నారు.
- న్యూఢిల్లీ, ఆంధ్రజ్యోతి
ఇవి కూడా చదవండి
ప్రజలతో మమేకమవ్వండి.. నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం
ఫేస్బుక్ పరిచయం.. యువతికి లంచ్ ఆఫర్.. చివరకు
Read Latest AP News And Telugu News
Updated Date - May 31 , 2025 | 05:43 AM