CM Chandrababu : గిరిజన చట్టాలను కాపాడతాం
ABN, Publish Date - Feb 16 , 2025 | 04:46 AM
సమగ్ర ప్రణాళికతో గిరిజనుల్లో పేదరికాన్ని నిర్మూలిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.
వారిలో పేదరిక నిర్మూలనకు సమగ్ర ప్రణాళిక: సీఎం
ఉగాది నుంచి ‘పీ-4’కు శ్రీకారం.. సంపద సృష్టించి పేదలకు అందిస్తాం
వెల్తీ.. హెల్తీ.. హ్యాపీ.. ఇదే ప్రభుత్వ నినాదం.. వీటి ప్రాతిపదికగానే స్వర్ణాంధ్ర విజన్
గిరిజనులను ఎమ్మెల్యేలు, మంత్రులను చేసిన ఘనత టీడీపీదే
సంత్ సేవాలాల్ సేవలు భావితరాలకు ఆదర్శం..జయంతి సందర్భంగా చంద్రబాబు నివాళులు
అమరావతి, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): సమగ్ర ప్రణాళికతో గిరిజనుల్లో పేదరికాన్ని నిర్మూలిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. గిరిజన చట్టాలను కాపాడతామని స్పష్టం చేశారు. వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ఎన్టీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారని, ఆయన స్ఫూర్తితో వారికి రాజకీయ అవకాశాలు కల్పించి అండగా నిలిచామని చెప్పారు. బంజారాల ఆరాధ్యదైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఉండవల్లిలోని తన నివాసంలో ఆయన చిత్రపటానికి చంద్రబాబు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. 1739 ఫిబ్రవరి 15న అనంతపురం జిల్లా గుత్తి మండలం రామ్జీ నాయక్ తండాలో జన్మించిన సేవాలాల్.. ప్రజలను ఎంతో ప్రభావితం చేశారన్నారు. ఆ మహానీయుడి సేవలు భావితరాలకు ఆదర్శమని.. ఆయన జయంతిని రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆయన పుట్టిన గ్రామం లో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించేందుకు రూ.50 లక్షలు విడుదల చేశామన్నారు. గిరిజన చట్టాలను కాపాడేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. గిరిజన మైదాన ప్రాం తాల్లో ‘సున్నా పేదరిక ప్రణాళిక’ను అమలు చేయనున్నట్లు తెలిపారు. ‘ఉగాది నుంచి పీ-4 (పబ్లిక్- ప్రైవేటు-పీపుల్- పార్ట్నర్షిప్) కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. దీని ద్వారా పేదరిక నిర్మూలనకు అడుగులు వేస్తాం. ఆర్థికంగా అగ్రస్థానంలో ఉన్న 10 శాతం మంది.. అట్టడుగున ఉన్న 20 % మందికి చేయూత ఇవ్వడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చు.
సంపద సృష్టిం చి పేదలకు అందిస్తాం. వెల్తీ, హెల్తీ, హ్యా పీ అనే ది మా ప్రభుత్వ నినాదం. ఈ మూడు సిద్ధాంతాల ఆధారంగా స్వర్ణాంధ్ర విజన్-2047కు రూపకల్పన చేశాం. సమైక్యాంధ్రలో 500 మంది జనా భా ఉన్న గిరిజన తండాలను పంచాయతీలుగా చేసిన ఘనత.. గిరిజనులను ఎమ్మెల్యేలు, మం త్రులను చేసిన ఘనత టీడీపీదే. ఉమ్మడి రాష్ట్రం లో వరంగల్కు చెందిన చందూలాల్ను మొదటిసారిగా మంత్రిని చేశాం’ అని గుర్తు చేశారు.
సంత్ సేవాలాల్కు లోకేశ్ నివాళి
సంత్ సేవాలాల్ మహారాజ్ సమాజ శ్రేయ స్సు కోసం చూపించిన మార్గం ఆదర్శనీయమని మంత్రి లోకేశ్ అన్నారు. తన పాటలు, రచనల ద్వారా ప్రజలను జాగృతం చేసిన గొప్ప మహనీయుడని కొనియాడారు. సేవాలాల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలోనూ సేవాలాల్ జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, పొలిట్బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రమణ్యం, పరుచూరి కృష్ణ, హాజీ హసన్ బాషా తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Feb 16 , 2025 | 04:46 AM