Health Department: బేబీ కిట్స్ పథకం పునఃప్రారంభం
ABN, Publish Date - May 20 , 2025 | 06:10 AM
ప్రభుత్వ ఆసుపత్రుల్లో పుట్టే శిశువులకు బేబీ కిట్స్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ప్రారంభించింది. ఒక్కో కిట్ విలువ రూ.1,410గా నిర్ణయించి 19 రకాల వస్తువులు అందించనున్నారు.
ఒక్కో కిట్లో రూ.1,410 విలువైన వస్తువులు
అమరావతి, మే 19(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వాస్పత్రుల్లో పుట్టిన చిన్నారుల కోసం బేబీ కిట్స్ పథకాన్ని ప్రభుత్వం పునఃప్రారంభించింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ ఎంటీ కృష్ణబాబు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కిట్లో 19 రకాల వస్తువులను బాలింతలకు అందించనున్నారు. ఒక్కో కిట్కు రూ.1,410 ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. బేబి కిట్స్ పథకం కోసం ప్రభుత్వం రూ.51 కోట్ల నిధులను కేటాయించింది. 2014-19 మధ్యలో అప్పటి టీడీపీ ప్రభుత్వం చిన్నారుల కోసం బేబీ కిట్స్ పథకాన్ని ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ పథకాన్ని విజయవంతంగా నిర్వర్తించింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బేబీ కిట్స్ను ప్రభుత్వం నిలిపివేసింది. అప్పటికే కొనుగోలు చేసిన లక్షల కిట్లను వృథా చేసింది. దీంతో చిన్నారులకు అవసరరమైన సబ్బులు, పౌడర్లు, టవల్స్, ఆయిల్స్ మొత్తం బాలింతులు కొనుగోలు చేసుకునేవారు. వీటి కోసం పేద కుటుంబాలు దాదాపు రూ.2 వేలు ఖర్చు చేసేవి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో బేబీ కిట్స్ పథకాన్ని పునఃప్రారంభించాలని సీఎం చంద్రబాబు సంకల్పించారు. అందులో భాగంగానే సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవించిన బాలింతలందరికీ ఈ కిట్లను అందించనున్నారు.
Updated Date - May 20 , 2025 | 06:11 AM