MSME : చిన్న పరిశ్రమలకు అండ
ABN, Publish Date - Sep 19 , 2024 | 03:39 AM
వ్యవసాయం తర్వాత రాష్ట్రంలో అత్యధిక మందికి ఉపాధి కల్పించే రంగమైన సూక్ష్మ, చిన్న, మద్యతరహా పరిశ్రమలను (ఎంఎ్సఎంఈ) మరింతగా ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
6 గ్యారంటీలతో ఆదుకుంటామన్న ప్రభుత్వం
నూతన ఎంఎస్ఎంఈ విధానం ఆవిష్కరణ
ఓఆర్ఆర్-ట్రిపుల్ఆర్ మధ్య 10 ‘పార్కులు’
5% మహిళలు, 15% ఎస్సీ, ఎస్టీ వర్గాలకు
ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రూ.కోటి,
ఇతరులకు రూ.30 లక్షల పెట్టుబడి రాయితీ
హైదరాబాద్, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయం తర్వాత రాష్ట్రంలో అత్యధిక మందికి ఉపాధి కల్పించే రంగమైన సూక్ష్మ, చిన్న, మద్యతరహా పరిశ్రమలను (ఎంఎ్సఎంఈ) మరింతగా ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పరిశ్రమల స్థాపనకు పెట్టుబడి రాయితీ కల్పించడం నుంచి ఉత్పత్తులను విక్రయించుకునేందుకు అవసరమైన సహకారం అందించేదాకా ఈ ప్రోత్సాహం ఉండనుంది. ఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్రంగా అధ్యయనం చేసిన ప్రభుత్వం.. బుధవారం ప్రకటించిన నూతన ఎంఎ్సఎంఈ విధానంలో వీటికి పరిష్కారాలు చూపిస్తూ అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలను వెల్లడించింది. ఆరు గ్యారంటీల రూపంలో వీటిని ప్రకటించింది.
వీటిలో.. ప్రత్యేక పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయడం, మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు, ప్రత్యేక ప్రోత్సాహకాలు కల్పించడం, పరిశ్రలకు అవసరమయ్యే స్థలాలను 30 ఏళ్లపాటు లీజుకు ఇవ్వడం, పరిశ్రమలకు ముడిసరుకును ప్రభుత్వమే సరఫరా చేయడం లాంటి నిర్ణయాలు ఉన్నాయి. హైటెక్సిటీ శిల్ప కళావేదికలో జరిగిన కార్యక్రమంలో నూతన ఎంఎ్సఎంఈ విధానాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు ఆవిష్కరించారు. అనంతరం ఎంఎ్సఎంఈ పాలసీని మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త విధానాన్ని రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు స్వాగతించారు. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రం పారిశ్రామిక విప్లవం దిశగా మరింత వేగంగా పయనిస్తుందని వివిధ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.
విడతల వారీగా పెండింగ్ బకాయిలు..
రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు 26.05 లక్షలు ఉన్నాయి. వీటిలో 32.67 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పించే రెండో అతిపెద్ద రంగం ఇదే. అయితే ప్రతి ఏటా వృద్ధి నమోదు కావాల్సిన ఈ రంగం.. గత కొన్నేళ్లుగా నష్టాల్లో కొనసాగుతోంది. పరిశ్రమల స్థాపనకు కావాల్సిన పెట్టుబడుల నుంచి ఉత్పత్తి విక్రయాల వరకు.. అడుగడుగునా సవాళ్లే ఎదురవుతున్నాయి. ముఖ్యంగా కొవిడ్ తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. నష్టాలు భరించలేక రాష్ట్రంలో వేలాది సంఖ్యలో చిన్నతరహా పరిశ్రమలు మూతపడ్డాయి. అనేక పరిశ్రమలు మూతపడే స్థితికి చేరుకున్నాయి. ప్రభుత్వం అందించే సబ్సిడీలు ఎంతోకొంత ఆసరాగా ఉంటాయని భావిస్తే.. అదీ లేకుండా పోయింది. గత ఐదారేళ్లుగా ప్రభుత్వం అందించాల్సిన దాదాపు రూ.3 వేల కోట్ల రాయితీలు పెండింగ్లో ఉన్నాయి. ఇలా ప్రభుత్వం నుంచీ సహకారం లేకపోవడంతో నిరాశ, నిస్తేజంలో ఉన్న పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన ఎంఎ్సఎంఈ విధానం నూతన ఉత్సాహాన్ని అందించింది. ఇప్పటికే పెండింగులో ఉన్న రూ.3 వేల కోట్ల రాయితీలను విడతల వారీగా విడుదల చేస్తామని ప్రకటించడంతోపాటు అనేక కొత్త ప్రోత్సాహకాలను ప్రభుత్వం ప్రకటించింది.
భూమి కేటాయింపు.. పెట్టుబడుల్లో రాయితీ..
పరిశ్రమల స్థాపనకు ఎదురవుతున్న భూమి సమస్యను పరిష్కరించేందుకుగాను త్వరలో ఓఆర్ఆర్-ట్రిపుల్ఆర్ మధ్య అభివృద్ధి చేయనున్న 10 కొత్త పారిశ్రామిక పార్కుల్లో ఐదింటిని ఎంఎ్సఎంఈలకు కేటాయించనున్నారు. వీటిలో ఒకటి మహిళల యాజమాన్యంలోని ఎంఎ్సఎంఈలకు, మరొకటి వినూత్న స్టార్ట్పలకు కేటాయిస్తారు. ఇందులో భూమిని 30 ఏళ్లకు లీజుకు అందిస్తారు. ఈ పారిశ్రామిక పార్కుల్లో 5శాతం మహిళలకు, 15శాతం ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు కేటాయిస్తారు. దీంతోపాటు ఎస్సీ, ఎస్టీ వ్యవస్థాపకులకు 50 శాతం భూమిని రాయితీగా ఇస్తారు. అంతేకాకుండా అన్ని సౌకర్యాలతో ప్రభుత్వమే ప్రైవేటు భాగస్వామ్యంలో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ సముదాయాలు నిర్మిస్తుంది. పరిశ్రమలకు పెట్టుబడికి మూలధనం కోసం ఇబ్బంది పడకుండా.. ఎస్సీ, ఎస్టీ వర్గాల వ్యవస్థాపకులకు తయారీ యూనిట్లకు 50 శాతం రాయితీ ఇస్తారు. ఇతర అన్ని ఎంఎ్సఎంఈలకు 25శాతం సబ్సిడీ ఇస్తారు. ఇక ఉత్పత్తుల విక్రయాల ఆధారంగా భవిష్యత్తులో రుణం పొందేందుకు పైలట్ ప్రోగ్రాం కూడా చేపడతారు.
ముడి పదార్థాల లభ్యత.. సుంకం తిరిగి చెల్లింపు
పరిశ్రమల నిర్వహణకు ముడి పదార్థాల సమస్య రాకుండా ప్రభుత్వమే ముడిపదార్థాలను అందుబాటులో ఉంచుతుంది. ముడిసరుకు దిగుమతిపై విధించిన సుంకాన్ని తిరిగి చెల్లిస్తుంది. రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లాలో 10 ఎంఎ్సఎంఈ క్లస్టర్లను, వాటి చుట్టూ కొత్త పారిశ్రామిక సౌకర్య కేంద్రాలు (కామన్ ఫెసిలిటీ సెంటర్) ఏర్పాటు చేస్తుంది. ఎంఎ్సఎంఈల్లో నాణ్యమైన కార్మిక వనరుల కోసం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో ప్రత్యేక కోర్సులు ప్రవేశపెడతారు. ఎంఎ్సఎంఈల కోసం కార్మిక చట్టాలకు సంబంధించిన నిబంధనల్ని సరళీకృతం చేస్తారు. వీటితోపాటు కొత్త సాంకేతికత, యంత్రాలు అందించేందుకు రూ. 100 కోట్లతో ప్రత్యేక నిఽధి ఏర్పాటు చేస్తారు. మేధో సంపత్తి హక్కుల (ఐపీఆర్) రిజిస్ర్టేషన్ను ప్రోత్సహించడం కోసం వందశాతం రిజిస్ర్టేషన్ ఖర్చును రీయింబర్స్మెంట్గా ఇస్తారు.
వ్యాపార విస్తరణ.. 24 గంటల సేవలకు ప్రత్యేక విభాగం
భారీ పరిశ్రమలకు కావాల్సిన భాగాలు, ఉత్పత్తులను ఎంఎ్సఎంఈలు అందించేలా ప్రోత్సహిస్తారు. ఎంఎ్సఎంఈలకు 24 గంటలపాటు నిరంతర సేవలు, మద్దతు అందించేందుకు పరిశ్రమల శాఖ కమిషనరేట్లో ప్రత్యేకంగా విభాగాన్ని ఏర్పాటు చేస్తారు. దీని పర్యవేక్షణకు పరిశ్రమల శాఖ మంత్రి నేతృత్వంలో రాష్ట్ర ఉన్నతస్థాయి స్టీరింగ్ కమిటీని నియమిస్తారు. ఉపాధి అవకాశాలు పెంచేందుకు, ఎంఎ్సఎంఈలను మరింత ప్రోత్సహించేందుకు 24 గంటల పాటు వ్యాపారాలు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతిస్తుంది. కొన్ని పరిమితులతో ఏడాదంతా నిరంతరంగా వ్యాపారం నిర్వహించేందుకు అనుమతిస్తుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం అమల్లో ఉన్న తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లి్షమెంట్ యాక్ట్-1988లో సవరణలు చేస్తుంది.
Updated Date - Sep 19 , 2024 | 03:39 AM