Minister Kollu Ravindra : బియ్యం బొక్కేసి నీతి కబుర్లా?
ABN, Publish Date - Dec 30 , 2024 | 04:17 AM
పీడీఎస్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని బియ్యం దొంగగా మారాడని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.
భార్య పేరు చెప్పుకొని సానుభూతికి యత్నాలు
పేర్ని నాని కేసుపై మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): పీడీఎస్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని బియ్యం దొంగగా మారాడని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 7,577 కేజీల బియ్యం బస్తాలు పేర్ని నాని గోడౌన్ నుంచి మాయంచేసి నగదుగా మార్చుకున్నట్లు అధికారుల విచారణలో వెల్లడైందన్నారు. ఈ కేసుకు సంబంధించి తాను సీఎం చంద్రబాబు వద్దకు వెళ్లి.. పేర్ని జయసుధను అరెస్టు చేయాలని కోరినట్లు, అందుకు సీఎం అంగీకరించలేదన్నట్లు పేర్ని నాని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇంగితజ్ఞానం ఉండే మాట్లాడుతున్నారా? ఇప్పుడు ఈ కేసులో పేర్ని నాని, ఆయన కొడుకు కిట్టు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. అసెంబ్లీలో వైసీపీ శాసనసభ్యులు చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని అగౌరవంగా మాట్లాడితే అప్పుడు పేర్ని నాని ఎందుకు నోరుమెదపలేదని ప్రశ్నించారు. బియ్యం మాయం కేసుతో పాటు పేదలకు ఇళ్ల స్థలాల కోసం భూముల కొనుగోలులో పేర్ని నాని చేసిన అక్రమాలపై విచారణ జరుగుతోందన్నారు. పొట్లపాలెం గోడౌన్ నుంచి కాకినాడకు పీడీఎస్ బియ్యం తరలిపోయినట్లు అధికారుల విచారణలో వెల్లడైందని, పూర్తి వివరాలు అందాక, తదుపరి చర్యలు ఉంటాయని మంత్రి తెలిపారు. కేసులతో సరిపెట్టమని, ఆస్తుల అటాచ్మెంట్ కూడా ఉంటుందని పేర్కొన్నారు.
Updated Date - Dec 30 , 2024 | 04:18 AM