Heavy Rains: గుబ్బల మంగమ్మ ఆలయం వద్ద చిక్కుకున్న 100 మంది భక్తులు
ABN, Publish Date - Jul 18 , 2024 | 09:31 PM
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో గోదావరి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముందస్తుగా వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తం అయినప్పటికీ రైతులు కాస్త ఇబ్బందులు పడవలసిన పరిస్థితులు ఎదురవుతున్నాయి.
ఏలూరు: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో గోదావరి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముందస్తుగా వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తం అయినప్పటికీ రైతులు కాస్త ఇబ్బందులు పడవలసిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం వర్షం కారణంగా గోదావరి జిల్లాలు జన జీవనం స్తంభించుకుపోయింది.
తూర్పు గోదావరి జిల్లాలపై ప్రభావం చూపిస్తుంది.ఈభారీ వర్షానికి ఎక్కడికక్కడ జన జీవనం స్తంభించుకుపోవడంతో పాటు నిత్య కార్మికుల సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏలూరు జిల్లా వేలేరుపాడు వాగులో కారు కొట్టుకుపోగా.. అందులోని ఐదుగురిని కాపాడారు. బుట్టాయిగూడెం మండలం కాపవరంలోని అటవీ ప్రాంతంలో గుబ్బల మంగమ్మ ఆలయం నుంచి వచ్చే మార్గంలో వాగు ఉద్ధృతితో 100 మంది భక్తులు, 30 మంది దుకాణదారులు గుడి వద్దే ఉండిపోయారు.
భారీ వర్షాలకు ఏలూరు జిల్లా ఏజెన్సీ మండలాల్లో కొండ వాగులు పొంగి పొర్లుతున్నాయి. జంగారెడ్డి గూడెం మండలం జల్లేరు వాగు, జీలుగుమిల్లి మండలం అశ్వారావుపేట వాగు ఉద్ధృతితో రాకపోకలు నిలిచిపోయాయి. కుక్కునూరు, దాచారం మధ్య గుండేటి వాగు హోరుతో.. వంతెన అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోయింది. పోలవరం మండలం రేపల్లెవాడ - కుంచివాడ మధ్య కాజ్వే పై భారీగా వరద చేరింది. బుట్టాయగూడెం కోటరామచంద్రాపురం వద్ద తూర్పు కాల్వ ప్రవాహంతో రాకపోకలు స్తంభించిపోయాయి. జైనవారిగూనె సమీప కాల్వలో స్కూలు బస్సు చిక్కుకుపోగా.. ట్రాక్టర్ సాయంతో స్థానికులు బయటకు లాగారు.
భద్రాద్రిలో 30 మంది..
భద్రాద్రి: వరదలో చిక్కుకున్న కూలీలను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించింది. పెద్దవాగు వరదలో చిక్కుకున్న 30 మంది కూలీలను సిబ్బంది తరలించారు. ఏలూరు నుంచి వచ్చిన హెలికాప్టర్లో కూలీలను సిబ్బంది తరలించారు. వర్షాలకు అశ్వారావుపేట మండలం నారాయణపురం దగ్గర పెద్దవాగు పోటెత్తింది. పెద్దవాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఒక్కసారిగా వరద పోటెత్తింది. మంత్రి తుమ్మల ఆదేశాలతో బాధితులను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించింది.
పోలవరంలో..
పోలవరంలో ఎడతెరిపిలేని కుండపోత వర్షం పడుతుంది. భారీ వర్షాలకు ఏజెన్సీలోవాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొయ్యలగూడెం మండలం కన్నాపురంలో పడమటి కాలువ ఉద్ధృతి పెరిగింది.
కుక్కునూరు మండలంలో..
కుక్కునూరు మండలం నారాయణపురం కట్ట మైసమ్మ గుడి వద్దా రోడ్డుపై నుంచి వరద ప్రవహిస్తున్నది. ఐదు కారులు,నాలుగు ఆటోలు, 10 బైకులు వరదలో చిక్కుకున్నాయి. 30 మందిని రక్షించేందుకు చేపట సహాయక చర్యలను పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పర్యవేక్షిస్తున్నారు. వరద ఉధృతిలో చిక్కుకున్న 30 మందిని కాపాడేందుకు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వితో మాట్లాడి ఎమ్మెల్యే చిర్రి బాలరాజు హెలిక్యాప్టర్ ఏర్పాటు చేయించారు. ఆంధ్ర తెలంగాణ కాదు ముందు ప్రజల ప్రాణాలు ముఖ్యం అని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తెలిపారు. .
రాజమండ్రిలో..
రాజమండ్రి: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు స్వల్పంగా గోదావరి ప్రవాహం పెరుగుతున్న ది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 10.80 అడుగులకు నీటిమట్టం పెరిగింది. బ్యారేజ్ 175 గేట్లు స్వల్పంగా ఎత్తివేసి 1.40 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేశారు.పాపికొండల విహారయాత్ర తాత్కాలికంగా అదికారులు నిలిపివేశారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లాకు తాకిన వరద నీరు పి.గన్నవరం మండలం గంటిపెదపూడిలో నదీపాయకు వేసిన తాత్కాలిక గట్టు తెగింది.నాలుగు లంక గ్రామాలకు రాకపోకలు. నిలిచిపోయాయి. గంటి పెదపూడి, బురుగులంక, అరిగెల వారిపాలెం ,పెదలంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
Updated Date - Jul 18 , 2024 | 09:37 PM