తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసులపైనా శ్రీవారి దర్శనం
ABN, Publish Date - Dec 31 , 2024 | 05:26 AM
తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సిఫారసు లేఖలపై తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతించేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించారు.
టి-సీఎం రేవంత్రెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ
సంతోషం వ్యక్తం చేసిన తెలంగాణ నేతలు, భక్తులు
అమరావతి, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సిఫారసు లేఖలపై తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతించేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించారు. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి లేఖ రాశారు. తెలుగుజాతి సత్సంబంధాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ లేఖలో వెల్లడించారు. సోమవారం నుంచి గురువారం వరకు ఏదైనా రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనం (రూ. 500 టికెట్), ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ. 300 టికెట్) కోసం రెండు లేఖలు చొప్పున కేటాయిస్తామని తెలిపారు. శ్రీవారి దర్శనానికి తమ ప్రజాప్రతినిధుల లేఖలు కూడా అనుమతించాలని కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి లేఖ రాసిన నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నారు. కాగా, అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అమరావతి సచివాలయంలో సోమవారం భేటీ అయ్యారు. తిరుమల దర్శనంపై తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు సంబంధించి చర్చించారు.
చంద్రబాబుకు ధన్యవాదాలు
చంద్రబాబు నిర్ణయం పట్ల తెలంగాణ లో నాయకులు, భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు చంద్రబాబుకు, బీఆర్ నాయుడుకు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబుకు తెలంగాణ మంత్రి కొండా సురేఖ కూడా ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ భక్తులకు నూతన సంవత్సర కానుకగా అభివర్ణించారు.
Updated Date - Dec 31 , 2024 | 05:26 AM