Warangal Police : అనాథ బాలికలే టార్గెట్
ABN, Publish Date - Mar 19 , 2025 | 06:29 AM
అనాథ బాలికలను టార్గెట్గా చేసుకుని, వారికి గంజాయి అలవాటు చేసి.. వ్యభిచారకూపంలోకి దింపేందుకు యత్నించే ఓ ముఠా గుట్టును వరంగల్ పోలీసులు రట్టుచేశారు.
గంజాయి మత్తులో దింపి వ్యభిచార రొంపి వైపు నెట్టే ముఠా
కానుకలతో ఎర.. గంజాయి ఇచ్చి ఓ బాలికపై అత్యాచారం
ఆరుగురు నిందితుల అరెస్టు.. ప్రధాన సూత్రధారి ఓ మహిళ
4,300 కండోమ్ ప్యాకెట్లు.. 1.8 కిలోల గంజాయి స్వాధీనం
వరంగల్ క్రైం, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): అనాథ బాలికలను టార్గెట్గా చేసుకుని, వారికి గంజాయి అలవాటు చేసి.. వ్యభిచారకూపంలోకి దింపేందుకు యత్నించే ఓ ముఠా గుట్టును వరంగల్ పోలీసులు రట్టుచేశారు. ఓ బాలికకు గంజాయి అలవాటు చేసి, తన ముఠా సభ్యుడు అత్యాచారానికి పాల్పడడానికి సహకరించిన గ్యాంగ్ లీడర్ ఓ మహిళ కావడం గమనార్హం..! మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వరంగల్ పోలీసు కమిషనర్ సన్ప్రీత్సింగ్ ఈ కేసు వివరాలను వెల్లడించారు. హనుమకొండ జిల్లా దామెర మండలం ల్యాదెల్ల గ్రామానికి చెందిన ముస్కు లత(38) అనాథ బాలికలను వలపన్ని, వారితో వ్యభిచారం చేయించాలనే పథకంతో ఓ ముఠాను ఏర్పాటు చేసింది. శంభునిపేటకు చెందిన అబ్దుల్ అప్నాన్, షేక్ సైలానీ బాబా, మహ్మద్ అల్తాఫ్, గంజాయి స్మగ్లర్ వదూద్ను తన ముఠాలో చేర్చుకుంది. అనాథలైన బడి పిల్లలను లక్ష్యంగా చేసుకుంది. ఈ క్రమంలో అప్నాన్ ప్రేమ పేరుతో ట్రాప్ చేసి ఓ అనాథ బాలికను పావుగా వాడుకోవడం ప్రారంభించింది. ఆ బాలిక సహకారంతో.. అనాథలుగా ఉన్న పాఠశాల విద్యార్థులను గుర్తించేది. ఈ క్రమంలో ఇన్స్టాగ్రామ్లో తొమ్మిదో తరగతి చదివే ఓ బాలికను గుర్తించి, వలపన్నింది. ఆమెకు రెండుమూడు సార్లు గంజాయి ఇచ్చింది. ఈ నెల 11న లతతో వెళ్లిన ఆ బాలిక, ఎంతకీ తిరిగిరాకపోవడంతో..
తల్లిదండ్రులు మీల్స్కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. అరెపల్లిలో ఆమెను గుర్తించారు. ఆమెతోపాటు.. లతతో ఉండే అనాథ బాలికను అదుపులోకి తీసుకుని, విచారిస్తే.. కిలేడీ ముఠా డొంక కదిలింది. అంతేకాదు.. బాధిత బాలికపై సైలానీ బాబా అత్యాచారం చేసి, వీడియో తీశాడని, పిలిచినప్పుడు రాకుంటే.. ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించిన విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుల వివరాలను సేకరించిన పోలీసులు.. మంగళవారం వారిని వలపన్ని పట్టుకున్నారు. లత, ఆమెకు సహకరించిన అనాథ బాలిక, ముఠా సభ్యులు-- అప్నాన్, సైలానీ, అల్తాఫ్, గంజాయి విక్రేత వదూద్లను అరెస్టు చేశామని సీపీ చెప్పారు. నిందితులపై పోక్సో, ఎన్డీపీఎ్స, మానవ అక్రమ రవాణా నిరోధక చట్టాల కింద కేసులు నమోదు చేసి, రిమాండ్కు తరలించినట్లు వివరించారు. వారి నుంచి 1.8 కిలోల గంజాయి, 4300 కండోమ్ ప్యాకెట్లు, రూ.75 వేల నగదు, ఒక కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అప్నాన్, సైలానీ, అల్తాఫ్, వదూద్ పాత నేరస్థులని, వారిపై కమిషనరేట్తోపాటు.. జయశంకర్-భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఠాణాలో పోక్సో, ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులు ఉన్నట్లు వెల్లడించారు.
Updated Date - Mar 19 , 2025 | 06:29 AM