Uttam: జేబులు నింపుకోవడానికే ప్రాజెక్టులు
ABN, Publish Date - Feb 21 , 2025 | 04:00 AM
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జేబులు నింపుకోవడానికే సాగునీటి ప్రాజెక్టులను నిర్మించారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. నాడు నీళ్ల కోసం ప్రాజెక్టులు కట్టలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలోనే నీటిపారుదల శాఖను అన్ని విధాలా నాశనం చేశారన్నారు.
కేసీఆర్, హరీశ్ వల్లే కృష్ణా జలాల్లో అన్యాయం: మంత్రి ఉత్తమ్
కేసీఆర్, హరీశ్ను ఉరి తీసినా తప్పులేదు: మంత్రి కోమటిరెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జేబులు నింపుకోవడానికే సాగునీటి ప్రాజెక్టులను నిర్మించారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. నాడు నీళ్ల కోసం ప్రాజెక్టులు కట్టలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలోనే నీటిపారుదల శాఖను అన్ని విధాలా నాశనం చేశారన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని నివారించడానికి జోక్యం చేసుకోవాలని కేంద్రాన్ని కోరామని చెప్పారు. గురువారం జలసౌధలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొన్నం ప్రభాకర్లతో కలిసి ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఉమ్మడి ఏపీలో 2004-14 దాకా పదేళ్లలో ఆంధ్రా ప్రాంతానికి 727 టీఎంసీల కృష్ణా జలాలను తరలిస్తే.. బీఆర్ఎస్ పదేళ్ల పాలన(2014-23)లో 1200 టీఎంసీలను ఏపీ తరలించిందన్నారు. జగన్తో విందు, వినోదాలు చేసుకొని రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు చేసుకోవడానికి, ముచ్చుమర్రి, మల్యాల, పోతిరెడ్డిపాడును విస్తరించుకోవడానికి కేసీఆర్ సహకారం అందించారని ఆరోపించారు.
అప్పటి సీఎం కేసీఆర్, నీటిపారుదల శాఖ హరీశ్ రావు వల్లే కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. బచావత్ ట్రైబ్యునల్ ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీల నీటిని కేటాయించగా.. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అనంతరం 2015 జూన్లో 299 టీఎంసీలు తెలంగాణకు చాలని అప్పటి కేసీఆర్, హరీశ్రావు ఒప్పందం చేసుకున్నారని మండిపడ్డారు. లక్ష కోట్లు అప్పు తెచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని, మేడిగడ్డ బ్యారేజీ కుంగినప్పుడు బీఆర్ఎస్సే అధికారంలో ఉందని చెప్పారు. ఈ నెలాఖరులోగా మేడిగడ్డపై జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్డీఎ్సఏ) నిపుణుల కమిటీ నివేదిక రానుందన్నారు. ఆ నివేదిక వచ్చాకే తదుపరి చర్యలు చేపడతామని ఆయన తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం చేసి, రాష్ట్రాన్ని నాశనం చేసింది అగ్గిపెట్టెరావు(హరీశ్ రావు), కేసీఆర్, మాజీ ఈఎన్సీ మురళీధర్రావు అని, వీరిని ఉరి తీసినా తప్పులేదన్నారు.
Updated Date - Feb 21 , 2025 | 04:00 AM