Bhupalpalli: ప్రేమ పెళ్లి వాయిదా పడటంతో ఒకరు.. ప్రేమించిన అమ్మాయితో పెళ్లి కాలేదని మరొకరు
ABN, Publish Date - Jan 21 , 2025 | 04:47 AM
ప్రేమించిన అమ్మాయితో పెళ్లి కావడం లేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోగా, ప్రేమ పెళ్లి వాయిదా పడటంతో మరో యువకుడు బలవన్మరణానికి పాల్పడిన రెండు వేర్వేరు ఘటనలు భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకున్నాయి.
బలవన్మరణానికి పాల్పడిన ఇద్దరు యువకులు
మహాముత్తారం/ మొగుళ్లపల్లి, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): ప్రేమించిన అమ్మాయితో పెళ్లి కావడం లేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోగా, ప్రేమ పెళ్లి వాయిదా పడటంతో మరో యువకుడు బలవన్మరణానికి పాల్పడిన రెండు వేర్వేరు ఘటనలు భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకున్నాయి. భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలోని సింగపల్లికి చెందిన వాసం మహేశ్ (24) అదే మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతిని ప్రేమించాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని బంధువుల ద్వారా ఆమె తల్లిదండ్రులకు మహేశ్ కబురు పంపగా యువతి తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో మనస్తాపం చెందిన మహేశ్ ఈ నెల 16న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు.
చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మరో ఘటనలో ప్రేమించిన అమ్మాయితో పెళ్లి వాయిదా పడిందనే మనస్తాపంతో మొగుళ్లపల్లి మండలం మొట్లపల్లికి చెందిన వంగ భరత్కుమార్ (20) అనే యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇటీవల భరత్కుమార్ తల్లి మృతి చెంది ఉన్న నేపథ్యంలో సంవత్సరీకం తర్వాత పెళ్లి చేస్తానని తండ్రి అతనికి చెప్పాడు. దాంతో మానసికంగా కుంగిపోయిన భరత్కుమార్ మద్యానికి బానిసయ్యాడు. ఇదే క్రమంలో పురుగుల మందు తాగాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.
Updated Date - Jan 21 , 2025 | 04:47 AM