kumaram bheem asifabad- ఉప్పొంగిన వాగులు ..
ABN, Publish Date - Jul 20 , 2025 | 11:05 PM
కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు, చింతలమానేపల్లి మండలాల్లో ఆదివారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి వాగులు, ఒర్రెలు ఉప్పొగుతున్నాయి. బెజ్జూరు మండలంలో ఆదివారం ఉదయం కురిసిన వర్షానికి మండలంలోని వాగులు, వంకలు పొంగి పోర్లడంతో రాక పోకలకు అంతరాయం కలిగింది.
బెజ్జూరు/చింతలమానేపల్లి, జూలై 20 (ఆంధ్రజ్యోతి): కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు, చింతలమానేపల్లి మండలాల్లో ఆదివారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి వాగులు, ఒర్రెలు ఉప్పొగుతున్నాయి. బెజ్జూరు మండలంలో ఆదివారం ఉదయం కురిసిన వర్షానికి మండలంలోని వాగులు, వంకలు పొంగి పోర్లడంతో రాక పోకలకు అంతరాయం కలిగింది. కుశ్నపల్లి, సోమిని గ్రామాల మధ్యలో లోలెవల్ వంతెనల పై నుంచి వరద నీరు ప్రవహించడంతో మధ్యాహ్నం వరకు రాక పోకలకు పూర్తిగా స్తంభించి పోయాయి. వాగు అవతల ఉన్న సుస్మీర్, సోమిని, మొగవెల్లి, ఇప్పలగుడూ, నాగెపల్లి, బండలూడ, గొర్రెగూడ తదితర గ్రామాలకు రాక పోకలు నిలిచి పోవడంతో ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దశాబ్దాలుగా లో లెవల్ వంతెనలపై హై లెవల్ వంతెనలు లేక పోవడంతో ప్రతి యేటా వర్షాకాలంలో అవస్థలు ఎదుర్కొంటున్న తమ ఇబ్బందులు ఎవరు పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చింతలమానేపల్లి మండలంలో ఆదివారం ఉదయం కురిసిన వర్షానికి మండలంలోని వాగులు, వంకలు పొంగి పోర్లడంతో రాక పోకలకు అంతరాయం కలిగింది. దిందా- కేతిని గ్రామాల మధ్యలో లో లెవల్ వంతెనల పై నుంచి వరద నీరు ప్రవహించడంతో మధ్యాహ్నం వరకు రాక పోకలకు పూర్తిగా స్తంభించి పోయాయి. బాబాసాగర్, నాయకపుగూడ వాగులు ఉప్పొంగి ప్రవహించడంతో రాక పోకలు నిలిచిపోయాయి. లో లెవల్ వంతెనలపై హై లెవల్ వంతెనలు లేక పోవడంతో ఏటా వర్షాకాలంలో అవస్థలు ఎదుర్కొంటున్న తమ ఇబ్బందులు ఎవరు పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కాగా కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆదివారం అత్యధిక రెబ్బెన మండలం వంకుళంలో 15.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సిర్పూర్(టి) మండలం లోనవెళ్లిలో 2.8, వాంకిడిలో 2.8, ఆసిఫాబాద్లో 2.5, కాగజ్నగర్లో 2.0 తిర్యాణి మండలం గిన్నెధరిలో 1.5, కెరమెరి మండలం ధనోరాలో 1.0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
Updated Date - Jul 20 , 2025 | 11:05 PM