స్పీకర్ పదవికే వన్నె తెచ్చిన శ్రీపాదరావు
ABN, Publish Date - Mar 03 , 2025 | 04:19 AM
శాసనసభ సభాపతి పదవికే వన్నె తెచ్చిన మహనీయుడు దుద్దిళ్ల శ్రీపాదరావు అని వక్తలు అభివర్ణించారు. పార్టీలకు అతీతంగా పనిచేసిన గొప్ప నాయకుడని కొనియాడారు.
రవీంద్రభారతిలో ఘనంగా జయంతి వేడుకలు
హైదరాబాద్, న్యూఢిల్లీ, రవీంద్రభారతి, మార్చి 2 (ఆంధ్రజ్యోతి) : శాసనసభ సభాపతి పదవికే వన్నె తెచ్చిన మహనీయుడు దుద్దిళ్ల శ్రీపాదరావు అని వక్తలు అభివర్ణించారు. పార్టీలకు అతీతంగా పనిచేసిన గొప్ప నాయకుడని కొనియాడారు. తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో దివంగత శాసనసభ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 88వ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు.మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొని శ్రీపాదరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. శ్రీపాదరావు తనలాంటి ఎంతోమందికి ఆదర్శప్రాయులని కొనియాడారు. స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ మాట్లాడుతూ.. ఉమ్మడి ఏపీ శాసనసభ స్పీకర్గా పనిచేసిన శ్రీపాదరావు ఆదర్శప్రాయులని అన్నారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. తన తండ్రి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ఆయనకు దక్కిన గౌరవంగా భావిస్తానని చెప్పారు. ఇందుకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి డీజీపీ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. శ్రీపాదరావు చిత్రపటానికి డీజీపీ కార్యాలయ ముఖ్య భద్రతాధికారి యోగేశ్వర్ రావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఢిల్లీ తెలంగాణ భవన్లోని అంబేడ్కర్ ఆడిటోరియంలోనూ శ్రీపాదరావు జయంతిని ఆదివారం నిర్వహించారు.
Updated Date - Mar 03 , 2025 | 04:19 AM