TG Govt: 12 అడుగుల ఎత్తుతో తెలంగాణ తల్లి విగ్రహాలు
ABN, Publish Date - Jun 25 , 2025 | 05:20 AM
రాష్ట్రంలోని 33 జిల్లాల కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. 12 అడుగుల ఎత్తులో ఈ ప్రతిమలను ఏర్పాటు చేయాలని..
అన్ని జిల్లా కలెక్టరేట్లలో ఏర్పాటు
ఒక్కో విగ్రహానికి రూ.17.5 లక్షలు
ప్రాథమికంగా నిర్ణయం.. త్వరలో ఖరారు
డిసెంబరు 9న ఆవిష్కరణలు
హైదరాబాద్, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 33 జిల్లాల కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. 12 అడుగుల ఎత్తులో ఈ ప్రతిమలను ఏర్పాటు చేయాలని, ఒక్కో విగ్రహ ఏర్పాటుకు దాదాపు రూ.17.5 లక్షల వరకు ఖర్చు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు సమాచారం. అయితే విగ్రహ ఎత్తు, ఖర్చు విషయంలో ఇంకా చర్చలు జరుగుతున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. డిసెంబరు 9న ఈ విగ్రహాలను ఆవిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా సచివాలయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం.. అరుణ వర్ణపు రవిక, ఆకుపచ్చ చీర, బంగారు రంగు అంచు, కాళ్లకు పట్టీలు, మెడలో ఆభరణాలు, ఒక చేతిలో వరి, సజ్జ, జొన్న, మొక్కజొన్న కంకులు, మరో చేయి ని అభయహస్తంగా చూపుతూ గ్రామీణ శ్రమైక జీవ న స్ఫూర్తి ఉట్టిపడేలా ప్రజలకు దర్శనమిస్తోంది. ఈ తరహాలోనే విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు.
విగ్రహం ధరపై చర్చ..
సచివాలయంలోని తెలంగాణ తల్లి విగ్రహం ఎత్తు 17 అడుగులు. పీఠం 3 అడుగులు కలిపి 20 అడుగుల ఎత్తులో ఉంది. జిల్లాల విషయానికి వస్తే పీఠం, విగ్రహం కలిపి 12 అడుగుల ఎత్తు ఉండేలా నిర్ణయించినట్టు సమాచారం. సచివాలయంలో ఏర్పాటు చేసిన విగ్రహానికి దాదాపు రూ.1.16 కోట్లను వెచ్చించారు. జిల్లాల్లో ఏర్పాటు చేయబోయే ఒక్కో విగ్రహం కోసం రూ.17.5 లక్షలను ఖర్చు చే యాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలిసింది. 33జిల్లాలకు కలిపి సుమారు రూ.5.77 కోట్లు అవుతుందని అంచనా. అయితే ఈ మొత్తంలో ఆశించిన స్థాయిలో విగ్రహ నిర్మాణం సాధ్యమవుతుందా..? ఎత్తు తగ్గింది కాబట్టి ధర సరిపోతుందా..? అనే అంశాలపై చర్చిస్తున్నారు. ఈ విషయంపై స్పష్టత రాగానే విగ్రహాలను రూపొందించేందుకు ఆర్డర్లు ఇవ్వనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ===
Updated Date - Jun 25 , 2025 | 05:23 AM