kumaram bheem asifabad- పేరుకే స్టేషన్.. ఆగని రైళ్లు
ABN, Publish Date - Jul 20 , 2025 | 11:09 PM
జిల్లాలోని రెండు నియోజక వర్గాల్లో సిర్పూర్ ఒకటి. మహారాష్ట్ర సరిహద్దు కలిగిన ఉన్న ఈ ప్రాంతవాసులకు రవాణా పరంగా సౌకర్యం అంతంతమాత్రమే. సిర్పూర్(టి)లో రైల్వే స్టేషన్ ఉన్నప్పటికీ పలు ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ లేక పోవడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేవలం రెండు ప్యాసింజర్ రైళ్లు మత్రమే నిలుపుదల ఉండడంతో మండల వాసులు సిర్పూర్(టి) నుంచి 18 కిలో మీటర్ల దూరంలో ఉన్న కాగజ్నగర్కు వెళ్లాల్సిన పరిస్థితి ఎదురవుతుంది.
సిర్పూర్(టి), జూలై 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని రెండు నియోజక వర్గాల్లో సిర్పూర్ ఒకటి. మహారాష్ట్ర సరిహద్దు కలిగిన ఉన్న ఈ ప్రాంతవాసులకు రవాణా పరంగా సౌకర్యం అంతంతమాత్రమే. సిర్పూర్(టి)లో రైల్వే స్టేషన్ ఉన్నప్పటికీ పలు ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ లేక పోవడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేవలం రెండు ప్యాసింజర్ రైళ్లు మత్రమే నిలుపుదల ఉండడంతో మండల వాసులు సిర్పూర్(టి) నుంచి 18 కిలో మీటర్ల దూరంలో ఉన్న కాగజ్నగర్కు వెళ్లాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. బెజ్జూరు, చింతలమానేపల్లి, కౌటాల మండలాల ప్రజలకు సిర్పూర్(టి) ప్రధాన కూడలి. ఈ ప్రాంత ప్రజలకు మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో వ్యాపార, కుటుంబపరంగా సంబంధాలు కలిగి ఉండడంతో నాగ్పూర్, చంద్రాపూర్ పట్టణాలకు తరుచూ రాక పోకలు సాగిస్తుంటారు. దీంతో పాటు రాష్ట్ర రాజధాని హైదారాబాద్కు పనుల నిమిత్తం వెళ్తుం టారు. ఇక్కడి స్టేషన్లో రైళ్ల నిలుపుదల లేక పోవడంతో అవస్థలు పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో చికిత్సల కోసం పట్టణాలకు వెళ్లాల్సి వస్తే రాత్రి 2 గంటలకు కాగజ్నగర్ వెళ్లి అక్కడి నుంచి భాగ్యనగర్ రైలు ఎక్కాల్సిన పరిస్థితి నెలకొంది. కాగజ్నగర్ నుంచి హైదరాబాద్కు రైలు టికెట్ ఒక్కరికి రూ.125 ఉండగా సిర్పూర్(టి) నుంచి కాగజ్నగర్ వరకు రాత్రి వేళల్లో ఆటోలో ఖర్చు రూ.600 నుంచి రూ.800 వరకు అదనపు భారం పడుతుందని ప్రజలు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు.
- ఉన్నత చదువులకు..
ఉన్నత చదువుల కోసం నియోజకవర్గంలోని విద్యార్థులు చాలా మంది హైదరాబాద్, విజయవాడ, చంద్రాపూర్, నాగ్పూర్ వంటి నగరాలకు వెళ్తుంటారు. వారితో పాటు ఉపాధి కోసం, వ్యాపార నిమిత్తం వెళ్లే వారు రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. సిర్పూర్(టి) నుంచి హైదరాబాద్కు బస్సులో టికెట్ రూ.700 ఉండడంతో భారంగా మారింది. కరోనా మహమ్మారి ముందు భాగ్యనగర్, నాగ్పూర్ ప్యాసింజర్ రైళ్లు సిర్పూర్ (టి)లో ఆగేవి. కరోనా సమయంలో వీటిని రద్దు చేశారు. తదనంతరం పునరుద్ధరించినా ఇక్కడ మాత్రం హాల్టింగ్ ఇవ్వలేదు.
- పట్టించుకోని నాయకులు..
కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండగా స్థానికంగా ఎంపీ, ఎమ్మెల్యేలు ఆ పార్టీకి చెందిన వారే ఉన్నారు. అయినా సమస్య పరిష్కరించక పోవడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎమ్మెల్యే హరీష్బాబు ఈ సమస్యపై చర్చించి త్వరలోనే భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ను సిర్పూర్(టి) వరకు పొడగిస్తామని హామి ఇచ్చినా ఇంత వరకు నెరవేర్చలేదు. ఇప్పటికైనా ప్రజల ఇబ్బదులు గుర్తించి పాలకులు, అధికారులు పరిష్కరించాలని కోరుతున్నారు. ఈ విషయమంపై ఆదిలాబాద్ ఎంపీ గొడెం నగేష్ను ‘ఆంధ్రజ్యోతి’ ఫోన్లో సంప్రదించగా సిర్పూర్(టి) రైల్వే స్టేషన్లో ఎక్స్ప్రెస్ రైళ్ల నిలుపుదల కోసం కేంద్ర రైల్వే శాఖ మంత్రితో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
Updated Date - Jul 20 , 2025 | 11:09 PM