kumaram bheem asifabad-పారిశుధ్య సిబ్బందిని కేటాయించాలి
ABN, Publish Date - Jul 01 , 2025 | 11:03 PM
రాజంపేట గ్రామపంచాయతీకి ఆసిఫాబాద్ మున్సిపాలిటీ నుంచి వెంటనే పారిశుధ్య సిబ్బందిని కేటాయించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో మంగళవారం అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఆర్డీవో లోకేశ్వర్రావులతో కలిసి ఆసిఫాబాద్ మున్సిపాలిటీ, రాజంపేట గ్రామ పంచాయతీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు
ఆసిఫాబాద్, జూలై 1(ఆంధ్రజ్యోతి): రాజంపేట గ్రామపంచాయతీకి ఆసిఫాబాద్ మున్సిపాలిటీ నుంచి వెంటనే పారిశుధ్య సిబ్బందిని కేటాయించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో మంగళవారం అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఆర్డీవో లోకేశ్వర్రావులతో కలిసి ఆసిఫాబాద్ మున్సిపాలిటీ, రాజంపేట గ్రామ పంచాయతీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆసిఫాబాద్ మున్సిపాలిటీ ఏర్పడే సమయంలో రాజంపేటను 10 వార్డులతో నూతన గ్రామ పంచాయతీగా ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. గ్రామ పంచాయతీ పరిధిలో 1,750 మంది జనాభా ఉన్నారని, పారిశుధ్య సిబ్బందిని ఆసిఫాబాద్ మున్సిపాలిటీ నుంచి కేటాయించలని తెలిపారు. మున్సిపాలిటీతో పాటు రాజంపేట గ్రామ పంచాయతీలో ప్రతి రోజు తడి, పొడిచెత్తలను ఇంటింటి నుంచి సేకరించి డంపింగ్ యార్డుకు తరలించాలన్నారు. అంతర్గత రహదారులు, మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్ర పరుచాలని సూచించారు. రాజేంపేట గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, చెత్తను తరలించే ట్రాలీలు అందించాలని వీధి దీపాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. వర్షాకాలంలో అంటువ్యాధులు, విష జ్వరాలు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని చెప్పారు. అవసరమైన ప్రాంతాలలో బ్లీచింగ్ పౌడర్ చల్లాలని దోమల వృద్ధిని అరికట్టేందుకు నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో ఆయిల్బాల్స్ వేయాలని సూచించారు. సమావేశంలో డీపీవో భిక్షపతి, డీఎల్పీవో ఉమర్హుస్సేన్, మున్సిపల్ కమిషన్ గజానంద్, ఎంపీడీవో శ్రీనివాస్ పాల్గొన్నారు.
వనమహోత్సవంలో పాల్గొనాలి
ఆసిఫాబాద్, జూలై 1 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్స వం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై మొక్కలు నాటి సంరక్షిం చాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా రవాణా శాఖ కార్యాలయ ఆవరణలో వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాతావరణ సమత్యుల్యాన్ని కాపాడేందుకు పెద్ద ఎత్తున మొక్కలు నాటాలన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ క్రీడా పాఠశాలలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి రాంచందర్, గ్రామీణాభివృద్ధి అధికారి దత్తారావు, జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 01 , 2025 | 11:03 PM